Share News

Mamata Banerjee: ప్రధాని మోదీవి కేవలం కల్లిబొల్లి మాటలే.. హామీలపై మమతా బెనర్జీ ధ్వజం

ABN , First Publish Date - 2023-12-11T20:20:42+05:30 IST

ఉచిత రేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రధాని మోదీవి కేవలం కల్లిబొల్లి మాటలని, గతంలో ఇచ్చిన ఎన్నో వాగ్ధానాలను ఆయన నెరవేర్చలేదని కడిగిపారేశారు.

Mamata Banerjee: ప్రధాని మోదీవి కేవలం కల్లిబొల్లి మాటలే.. హామీలపై మమతా బెనర్జీ ధ్వజం

Mamata Banerjee On BJP: ఉచిత రేషన్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రధాని మోదీవి కేవలం కల్లిబొల్లి మాటలని, గతంలో ఇచ్చిన ఎన్నో వాగ్ధానాలను ఆయన నెరవేర్చలేదని కడిగిపారేశారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన ప్రజల్ని మభ్యపెట్టేలా హామీలిస్తారంటూ దుయ్యబట్టారు. ఇప్పుడు ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌ను పొడిగిస్తామని ఇచ్చిన హామీని.. రేపు ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తప్పకుండా మర్చిపోతారని ధ్వజమెత్తారు.


ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద ఉచిత రేషన్‌ను డిసెంబర్‌ తర్వాత ఐదేళ్లపాటు పొడిగించనున్నామని, దీని వల్ల దాదాపు 80 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ.. ‘‘లోక్‌సభ ఎన్నికలకు కేవలం కొన్ని నెలల సమయం మాత్రమే ఉందనగా.. ప్రధాని మోదీ ఈ ఉచిత రేషన్ వాగ్ధానం చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోతే.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం ఎక్కడా కనిపించరు. ఒకవేళ వాళ్లు ఈ ఎన్నికల్లో గెలిచినా.. తమ వాగ్దానాన్ని తప్పకుండా మరిచిపోతారు. గతంలో ప్రతి పౌరుడి ఖాతాలో రూ.15 లక్షలు బదిలీ చేస్తానని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైంది?’’ అని చెప్పుకొచ్చారు.

గత ఎన్నికలకు ముందు కొండల్లో మూతపడిన ఐదు తేయాకు తోటలను తెరిపిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని.. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో బీజేపీ విఫలమైందని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఇచ్చిన హామీల్ని బీజేపీ ఏమాత్రం నిలబెట్టుకోదని, తామిచ్చిన హామీల్ని మాత్రం తప్పకుండా నిలబెట్టుకుంటామని మాటిచ్చారు. జల్‌పైగురి జిల్లాలో మూతపడిన ఆరు తేయాకు తోటలను తమ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1500 నెలవారీ సాయం అందజేస్తుందని ఆమె చెప్పారు. ఇదే సమయంలో.. మిగులు భూమి ప్రస్తుత స్థితిని సమీక్షించిన తర్వాత పట్టా పంపిణీని వెంటనే ప్రారంభించాలని బెనర్జీ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

Updated Date - 2023-12-11T20:21:56+05:30 IST