BBC Modi Documentary: చైనా కంపెనీ హువాయ్‌ ద్వారా నిధులు అందాయన్న జెఠ్మలానీ

ABN , First Publish Date - 2023-01-31T20:27:15+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ(BBC) డాక్యుమెంటరీ వెనుక చైనా ఉందని...

BBC Modi Documentary: చైనా కంపెనీ హువాయ్‌ ద్వారా నిధులు అందాయన్న జెఠ్మలానీ
BBC Modi Documentary

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ(BBC) డాక్యుమెంటరీ వెనుక చైనా ఉందని బీజేపీ(BJP) రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ (Mahesh Jethmalani ) ఆరోపించారు. చైనా (China) కంపెనీ హువాయ్ (Huawei) నుంచి నిధులు అందుకుని బీబీసీ ఇలాంటి తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. బీజింగ్ అజెండాను బీబీసీ అమలు చేస్తోందంటూ ఆయన ట్వీట్ చేశారు. బ్రిటన్‌కే చెందిన స్పెక్టేటర్ కథనాన్ని ఆయన ట్వీట్‌కు జోడించారు. కామ్రేడ్ జైరామ్ కూడా బీబీసీ ఫాలోయరేనని జెఠ్మలానీ ఆరోపణలు చేశారు. బీబీసీకి ప్రస్తుతం డబ్బులు అవసరమని, అందుకే చైనా కంపెనీ నుంచి తీసుకుందన్నారు. బీబీసీ వ్యవహారం ముమ్మాటికీ డబ్బులు తీసుకుని దుష్ప్రచారం చేయడమేనని ఆయన తేల్చి చెప్పారు. బీబీసీ చాలా కాలంగా భారత్‌కు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తోందని కూడా ఆయన ట్వీట్ చేశారు. 2021లో జమ్మూకశ్మీర్ లేకుండా భారత్ మ్యాప్ ప్రచురించిన విషయాన్ని కూడా జెఠ్మలానీ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీసిన డాక్యుమెంటరీ కూడా అదే తరహా దుష్ప్రచారమేనని ఆయన ట్వీట్ చేశారు.

మరోవైపు మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని రష్యా కూడా తప్పుబట్టింది. దుష్ప్రచారంలో భాగంగానే బీబీసీ ఈ పని చేస్తోందంటూ రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్ ఆరోపించారు. సమాచార యుద్ధానికి బీబీసీ దారులు తీస్తోందన్నారు. రష్యాపైన, అంతర్జాతీయంగా స్వతంత్ర విధానాలున్న దేశాలపైనా బీబీసీ ఇలాంటి దుష్ప్రచారమే చేస్తోందని లవ్‌రోవ్ ఆరోపించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi)పై బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీ సిరీస్‌పై భారతీయ జనతా పార్టీ నేత అమిత్ మాలవీయ మండిపడ్డారు. భారత్‌కు చట్టాలపై, పాలనపై, మానవ హక్కులపై నీతులు చెప్పొద్దంటూ ఆ పార్టీ నేత అమిత్ మాలవీయ హితవు పలికారు. గుజరాత్ అల్లర్ల పేరుతో మోదీని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పన్నిన కుట్ర భగ్నమైందన్నారు. స్వయంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మోదీకి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బీబీసీ (BBC) మోదీపై రెండు భాగాలుగా ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో మోదీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్తూ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ఈ డాక్యుమెంటరీలో విమర్శలు గుప్పించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బ్రిటన్ అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీ షో వలసవాద ఆలోచనా ధోరణిని వెల్లడిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి అన్నారు. విశ్వసనీయత లేని కథనాన్ని అందరి మనసుల్లోకి చొప్పించాలనే లక్ష్యంతో రూపొందించిన, తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని ఆరోపించారు. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నారు. ఇటువంటి కథనాన్ని ప్రచారం చేయడంలో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) వ్యక్తుల ధోరణి కనిపిస్తోందన్నారు.

అటు కేంద్రం కూడా ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్‌’ పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని భారత్‌లో బ్లాక్‌ చేయాలంటూ యూట్యూబ్‌, ట్విటర్‌లను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ డాక్యుమెంటరీ మొదటి భాగాన్ని బీబీసీ ఇటీవల భారత్‌ మినహా ఇతర దేశాల్లో విడుదల చేసింది. భారత్‌లో బీబీసీ ఈ డాక్యుమెంటరీని ప్రసారం చేయకున్నా.. కొందరు వ్యక్తులు యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. ట్విటర్‌లోనూ ఈ డాక్యుమెంటరీ లింకులను షేర్‌ చేశారు. వాటిని తొలగించాలని, భవిష్యత్‌లో ఈ వీడియో అప్‌లోడ్‌ కాకుండా బ్లాక్‌ చేయాలని అపూర్వచంద్ర తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. సమాచార సాంకేతిక నిబంధనలు-2021లోని ఎమర్జెన్సీ అధికారాలను వినియోగించి, ఈ ఆదేశాలను జారీ చేశారు. కాగా.. ఈ డాక్యుమెంటరీపై 302 మంది మాజీ జడ్జిలు, విశ్రాంత బ్యూరోక్రాట్లు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్య. విభజించు-పాలించు అనేది బ్రిటిష్‌ నైజం అయితే.. అందరినీ కలుపుకొనిపోవడం భారత్‌ నీతి. బీబీసీ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని వారు వ్యాఖ్యానించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పైనా, 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లపైనా రూపొందించిన బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధించడంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అడ్వకేట్ ఎంఎల్ శర్మ (Advocate ML Sharma) దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై ఫిబ్రవరి 6న విచారణ జరుపుతామని తెలిపింది. ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులతో ఇచ్చిన ట్వీట్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎన్ రామ్, అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్లపై కూడా అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపబోతోంది. ‘ఇండియా : ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని నిషేధించడం దురుద్దేశపూర్వకం, నిరంకుశం, రాజ్యాంగ విరుద్ధం అని ఎంఎల్ శర్మ తన పిటిషన్‌లో ఆరోపించారు. దీనిపై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) అంగీకరించారు. ఫిబ్రవరి ఆరున విచారణ జరుపుతామన్నారు.

Updated Date - 2023-02-01T15:57:36+05:30 IST