RRR : తెర వెనుక హీరోలు వీళ్లు.. వేయండి వీర తాళ్లు!

ABN , First Publish Date - 2023-03-14T03:17:03+05:30 IST

ఆద్భుతాలెప్పుడూ ఒకరివల్లే సాధ్యం కావు. వెనుక కనీ, కనిపించనని ఓ సమూహం ఉంటుంది. ఎంత పెద్ద భవనం కడితే పునాది అంత పటిష్టమైనపునాది తవ్వాలి. ఎంత పెద్ద కల కంటే...

RRR : తెర వెనుక  హీరోలు వీళ్లు.. వేయండి వీర తాళ్లు!

ఆద్భుతాలెప్పుడూ ఒకరివల్లే సాధ్యం కావు. వెనుక కనీ, కనిపించనని ఓ సమూహం ఉంటుంది. ఎంత పెద్ద భవనం కడితే పునాది అంత పటిష్టమైనపునాది తవ్వాలి. ఎంత పెద్ద కల కంటే... అంత కష్టం వెంటపడుతుంది. తలో చేయీ వేసి, చెరో చమట చుక్క రాల్చుకొంటూ శ్రమిస్తేనే కనులు సైతం కనని నిజాలు ఆవిష్క్రతమవుతాయి. ‘ఆస్కార్‌’ కూడా అలాంటి అద్భుతమే. ‘అండ్‌ ద అవార్డ్స్‌ గోస్‌ టూ నాటు నాటు’ అనగానే వేదికపైకి కీరవాణి, చంద్రబో్‌సలు మాత్రమే వెళ్లి ఉంటారు గాక... వారిద్దరి చేతుల్లోనే అవార్డు పెట్టి ఉంటారు గాక... కానీ ఆ ఆస్కార్‌ ప్రతిమ ముద్దాడడానికి చాలామందే కారకులయ్యారు. వారందరి కష్టానికీ, ప్రతిభకూ వీరతాళ్లు వేయాల్సిన సమయం ఇది.

9keeravani.jpg

‘పెద్ద’(న్న) పాత్ర!

రాజమౌళి సినిమా అనగానే ఆయన బృందంలో ఎవరున్నా, లేకున్నా ‘పెద్దన్న’గా పిలుచుకొనే కీరవాణి ఉండాల్సిందే. ఎందుకంటే కీరవాణి లేని రాజమౌళి సినిమా లేదు. దానికి తగ్గట్టే కీరవాణి తన పాటలతో, నేపథ్య సంగీతంతో జక్కన్న కలలకు, ఆలోచనలకు మరింత ఎలివేషన్‌ ఇస్తుంటారు. మిగిలిన దర్శకులతో కంటే రాజమౌళితో ఆయన ట్యూనింగ్‌ పర్‌ఫెక్ట్‌గా కుదురుతుంది. జక్కన్న మనసులో ఏముందో, కీరవాణికి బాగా తెలుసు. అందుకే వారిమధ్య పెద్దగా చర్చలేవీ లేకుండానే పాటలు పుట్టేస్తుంటాయి. ‘నాటు నాటు’ విషయంలోనూ అచ్చంగా ఇదే జరిగింది. ఇది ఇద్దరు హీరోలు (ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌)ల కథ. వారిద్దరూ మంచి డాన్సర్లు. కాబట్టి.. ఇద్దరూ కలిసి నాట్యం చేస్తే చూడాలని అభిమానులు కోరుకొంటారు. అందుకే ‘ఓ మంచి డాన్స్‌ నంబర్‌ ఉండాల్సిందే’ అని రాజమౌళి ముందే ఫిక్సయ్యాడు. కాకపోతే... ఆ పాట కథలో భాగం అయ్యేలా చూసుకొన్నాడు. జక్కన్నకు రాజమౌళి చెప్పిన విషయం ఒక్కటే. ‘ఇద్దరు హీరోలూ అదిరిపోయేలా డాన్స్‌ చేయాలి.. అలాంటి పాట కావాలి’ అని. వెంటనే కీరవాణి రంగంలోకి దిగిపోయారు. తనకి ఇష్టమైన గీత రచయిత చంద్రబో్‌సని పిలిపించారు. రాజమౌళి తనకేం చెప్పారో... అదే ముక్క చంద్రబోస్‌కి అందించారు. ‘ఇద్దరు హీరోలూ డాన్స్‌ ఇరగదీయాలి..’ అని. ‘పాటలో ఎక్కడా బ్రిటీష్‌ వారిని కించపరుచకూడద’న్నది ఒక్కటే కండీషన్‌. చంద్రబోస్‌ కూడా చాలా త్వరగా పల్లవి పూర్తి చేశారు. ‘నాటు నాటు’ అనే హుక్‌ లైన్‌ కీరవాణికి బాగా నచ్చేసింది. అయితే చరణాల దగ్గర మాత్రం కసరత్తు జరిగింది. చిన్న చిన్న పదాలు మార్చుకొంటూ, పేర్చుకొంటూ, కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా పాటని ట్యూన్‌ చేసుకొంటూ.. ఇలా ఈ ఒక్క పాట దగ్గరే యేడాదిన్నర కష్టపడ్డారు. పాట రాశాక... ట్యూన్‌ కట్టిన బాణీ ఇది. అందుకే ప్రతి పదం స్పష్టంగా వినిపిస్తుంది. అయితే, షూటింగ్‌ సమయంలో.. ఏదో మిస్సయ్యిందన్న ఫీలింగ్‌ కలిగింది. అప్పటికప్పుడు పాటలోని చివరి చరణాన్ని చంద్రబో్‌సతో రాయించి, ఆఘమేఘాల మీద రికార్డ్‌ చేసి, చిత్రీకరించారు. ఈ పాట వింటున్నా మన పాదాలకు తెలియకుండానే పూనకాలు తెప్పిస్తుంది. ఇదంతా.. కీరవాణి చేసిన మ్యాజిక్‌.

9chandrabose.jpg

బోస్‌... ది బాస్‌!

‘నాటు... నాటు’ పాటని జాగ్రత్తగా గమనిస్తే అందులో తెలంగాణ, ఆంధ్రా రెండు మాండలికాలకు చెందిన పదాలు వినిపిస్తాయి. కావాలని తీసుకొన్న జాగ్రత్త ఇది. ఎందుకంటే ఇది కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు పాడుకొనే పాట. ఒకరిది తెలంగాణ, మరొకరిది ఆంధ్రా. కాబట్టి వారి వారి మాండలికాల్ని పాటలో పేర్చాల్సిందే. ఇలా రెండు మాండలికాలపైనా పట్టుండి, తెలుగు భాషలోని మాధుర్యాన్ని సాధికారికంగా పాటలో ఒంపగల సామర్థ్యం గల రచయిత కావాలి. ఆ సత్తా.. చంద్రబో్‌సకి ఉందని కీరవాణికి బాగా తెలుసు. అందుకే గీత రచయితగా ఆయన్ని ఎంచుకొన్నారు. కీరవాణి నమ్మకాన్ని చంద్రబోస్‌ వమ్ము చేయలేదు. ఈపాటకు 200 శాతం న్యాయం చేశారు. ఈ ఒక్క పాట కోసమే దాదాపు 19 నెలలు కష్టపడ్డారు. 90 శాతం పాటని రెండు మూడు రోజుల్లో పూర్తి చేసిన చంద్రబోస్‌, ‘శుభం కార్డు’ వేయడానికి నెలల పాటు నిరీక్షించాల్సివచ్చింది. ఈ మధ్యలో కీరవాణితో ప్రతిరోజూ చర్చలు సాగుతూనే ఉండేవి. రోజుకో పదం పుట్టేది. ఒక్కోసారి అది కూడా ఉండేది కాదు. ‘ఇంత కష్టపడి రాసిన తరవాత.. ఈ పాట సినిమాలో ఉంటుందా, లేదా’ అనే అనుమానం కూడా చంద్రబో్‌సని వెంటాడేది. కానీ వాటిని కూడా పక్కన పెట్టి పాట కోసం శ్రమించారు. ప్రతీ వాక్యంలోనూ తెలుగు సంస్కృతి, జీవన విధానం, ఆర్థిక స్థితిగతులు, అప్పటి కాలమాన పరిస్థితులు ఉట్టిపడేలా రాశారు చంద్రబోస్‌. ఈ పాట చంద్రబోస్‌ కెరీర్‌లో ఓ మేలిమి బంగారపు ముద్ద. అందుకే ఆస్కార్‌లోనూ తళుక్కుమంది.

30 ‘నాటు నాటు’లో మనం చూసే హుక్‌ స్టెప్పులు మూడే. కానీ, ప్రేమ్‌ రక్షిత్‌ డిజైన్‌ చేసింది 30 హుక్‌ స్టెప్పులు. వాటిలోంచి మూడింటిని రాజమౌళి ఎంచుకున్నారు.

rrr.jpg

సింక్‌ మామూలుగా లేదు

తెర వెనుక ఈ పాట కోసం ఎంతమందైనా కష్టపడి ఉండొచ్చు. తెర ముందు చెమట చిందించింది మాత్రం.. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లే. విడివిడిగా డాన్స్‌ చేస్తూంటేనే వీళ్లని చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు. అలాంటిది కలిసి ఆడితే ఎలా ఉంటుందో వేరే చెప్పాలా? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పాటకు మంత్రముగ్థమైపోయారంటే.. కారణం.. కచ్చితంగా ఎన్టీఆర్‌, చరణ్‌లే. వాళ్లిద్దరూ ఒకే సింక్‌లో కాలు కదపడం చూసి వెండి తెర సైతం పులకించిపోయింది. ఎంతటి క్లిష్టమైన స్టెప్‌ అయినా ఇలా చూసి, అలా నేర్చుకొనే ఎన్టీఆర్‌, చరణ్‌లు సైతం ప్రతిరోజూ... మూడు గంటల ప్రాక్టీస్‌ చేసేవాళ్లంటే వాళ్లు ఈ పాటపై ఎంత ఫోకస్‌ పెట్టారో అర్థం చేసుకోవొచ్చు. ‘నాటు నాటు’ హుక్‌ స్టెప్‌ కోసం రాజమౌళి ఏకంగా 18 టేకులు తీసుకోవడం చూసి ఎన్టీఆర్‌కి చాలా కోపం వచ్చేసిందట. ‘అంతా బాగానే ఉంది కదా.. ఎందుకు ఇన్ని టేకులు’ అనే అసహనం మొదలైంది. కానీ రాజమౌళి విజన్‌ తెలిసిన వ్యక్తిగా.. ఆయన ‘వన్‌ మోర్‌’ అనగానే అన్నీ మర్చిపోయి మళ్లీ కెమెరా ముందుకు వచ్చే వారు ఈ ఇద్దరు హీరోలూ. 18 టేకులు తీసుకొన్నా, చివరికి ఓకే చేసింది రెండో టేకే. ప్రతీ రోజూ వేసిన స్టెప్పే వేసి ఒళ్లు హూనం చేసుకోవడం, మరుసటి రోజు సరికొత్త ఎనర్జీతో సెట్‌కి రావడం.. ఇదే వారిద్దరికీ పరిపాటి అయ్యింది. ఆ కష్టం వృథా కాలేదు. ‘నాటు నాటు’ పాటంటే ముందు కళ్లముందు మెదిలేది వీరిద్దరే. ఈ పాటే ఎన్టీఆర్‌, చరణ్‌లను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ పాటే.. వారిద్దరినీ గ్లోబల్‌ స్టార్లుగా మార్చింది.

18 ‘నాటు నాటు’ పాటలో ఒక హుక్‌స్టెప్పు కోసం రాజమౌళి 18 టేకులు తీశారు. చివరికి రెండో టేకునే ఓకే చేశారు.

నా ఆట చూడూ...!

‘నాటు నాటు’ పాట ట్యూను, సాహిత్యం, సందర్భం.. ఇవన్నీ ఒక ఎత్తు. ఈ పాటలో నాట్యం మరో ఎత్తు. ఈ పాటకు ‘నాటు’ వేసిందే, నాటు అనే పదం. మరి.. ఆ ఆట ఎలా ఉండాలో చెప్పేదేముంది? పైగా ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లే. దీంతో నృత్య దర్శకుడు ప్రేమ్‌ రక్షిత్‌కి పెద్ద పనే పడింది. ఎన్టీఆర్‌, చరణ్‌లకు డాన్స్‌ కంపోజ్‌ చేసిన అనుభవం ఆయనకు ఉంది. అది ప్లస్‌ పాయింట్‌. కానీ ఇద్దరికీ కలిపి ఓ పాటకు డాన్స్‌ కంపోజ్‌ చేసిన అనుభవం ఆయనకే కాదు.. ఇప్పటి వరకూ ఏ నృత్య దర్శకుడికీ లేదు. ఇదే అతి పెద్ద మైనస్‌. అయితే దాన్ని కూడా ఓ అరుదైన అవకాశంగా తీసుకొన్నారు ప్రేమ్‌ రక్షిత్‌. ఎన్టీఆర్‌, చరణ్‌ ఇద్దరి బాడీ లాంగ్వేజ్‌ ప్రేమ్‌కి బాగా తెలుసు. దీంతో ఈ పాట కోసం 95 స్టెప్పులు , 30 హుక్‌స్టెప్పులు కంపోజ్‌ చేశారు. వాటిలో మూడు హుక్‌ స్టెపుల్ని జక్కన్న ఎంపిక చేసుకున్నారు. ఆ స్టెప్పులకే ఇప్పుడు ప్రపంచమంతా పాదాలు కదుపుతోంది.

95 ‘నాటు నాటు’ పాటకోసం ప్రేమ్‌ రక్షిత్‌ కంపోజ్‌ చేసిన స్టెప్పుల సంఖ్య ఇది!

దుమ్మారం రేగింది

‘నాటు నాటు’ పాట చూస్తే అదేదో ఫాస్ట్‌ ఫార్వర్డ్‌లో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఆ వేగం అలా ఉంటుంది. ఇలాంటి పాట పాడాలంటే... ఆ గాయకుడికి ఎంత దమ్ము ఉండాలో ఊహించండి. ఏ పాటని ఎవరితో పాడించాలి? అనే విషయంలో కీరవాణికి కొన్ని నిర్దిష్టమై ప్రణాళికలు ఉంటాయి. పాటని ముందు ట్రాక్‌ సింగర్స్‌తో పాడించుకోవడం ఆయనకు అలవాటు. అలా ఈ పాట ట్రాక్‌ని రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలతో పాడించారు. దీనికి కారణం.. ‘రంగస్థలం’లో టైటిల్‌ సాంగ్‌ రాహుల్‌ పాడాడు. ఆ పాటలో చరణ్‌కి రాహుల్‌ గొంతు సరిగ్గా సరిపోయింది. ‘అరవింద సమేత’లో ‘పెనిమిటీ’ పాట పాడాడు కాలభైరవ. ఇక్కడ కూడా ఎన్టీఆర్‌ గొంతుని సేమ్‌ టూ సేమ్‌ మ్చాచ్‌ చేశాడు కాలభైరవ. ఈ పాటలు, వాటి ఫలితాలు కూడా రాహుల్‌, కాలభైరవలకు కలిసొచ్చాయి. దాంతో.. చివరికి ట్రాక్‌ పాటే ఫైనల్‌ అయిపోయింది. ఇప్పుడు వీరిద్దరే ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ గీతాన్ని ఆలపించి.. ఆడిటోరియాన్ని ఉర్రూతలూగించారు.

15 ‘నాటు నాటు’ పాట షూటింగ్‌కు 15 రోజులకు పైగానే సమయం పట్టింది.

Updated Date - 2023-03-14T03:17:08+05:30 IST