Amritpal Singh: పోలీసులకు దొరక్కుండా అమృత్ ‌పాల్ సింగ్‌‌కి కంటి ఆపరేషన్?.. పక్కా ప్లాన్ ఎందుకంటే..

ABN , First Publish Date - 2023-04-07T16:18:52+05:30 IST

పంజాబ్ పోలీసులతో దాగుడుమూతలు ఆడుతూ, తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ గురించి...

Amritpal Singh: పోలీసులకు దొరక్కుండా అమృత్ ‌పాల్ సింగ్‌‌కి కంటి ఆపరేషన్?.. పక్కా ప్లాన్ ఎందుకంటే..

చండీగఢ్: పంజాబ్ పోలీసులతో దాగుడుమూతలు ఆడుతూ, తప్పించుకుని తిరుగుతున్న ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2022లో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేముందు జార్జియా (Georgia)లో కంటి ఆపరేషన్ (Eye Surgery) చేయించుకున్నాడు. ఖలిస్థాన్ ఉగ్రవాది జర్నేల్ సింగ్ బ్రిందన్ వాలా పోలికలతో కనిపించేలా అప్పట్నించే ఆయన తగు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని వర్గాలు ఈ తాజా సమాచారం బయటపెట్టాయి. జాతీయ భద్రతా చట్టం (NSA)కింద అరెస్టయి, ప్రస్తుతం డిబ్రూగడ్ జైలులో ఉన్న అమృత్‌పాల్ సింగ్ అనుచరుల నుంచి ఈ విషయాలను ఇంటెలిజెన్స్ వర్గాలు రాబట్టాయి. అమృత్‌పాల్ కంటి శస్త్ర చికిత్స కోసం రెండేళ్ల పాటు జార్జియాలోనే ఉండి అక్కడే సర్జరీ చేయించుకున్నట్టు అమృత్‌పాల్ అనుచరుల సమాచారం.

'వారిస్ పంజాబ్ దే' సంస్థ చీఫ్‌గా ఉన్న అమృత్‌పాల్ తనను తాను బింద్రన్ వాలా-2గా ఫోకస్ చేసుకునేందుకు ప్రయత్నించే వాడు. అందుకు అనుగుణంగానే ఆయన తన టర్బన్, సిక్కు దుస్తులు, సిక్కు గుర్తులు బింద్రన్ వాలాను గుర్తుతెచ్చేలా చూసుకునేవాడు.

జర్నయిల్ సింగ్ బింద్రన్ వాలా 1984 జూన్ 6న జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌లో హతమయ్యాడు. దీంతో ఖలిస్థాన్ ఉగ్రవాదులపై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ విజయవంతమైంది. ఒకప్పుడు దుబాయ్ నివాసిగా ఉన్న అమృత్‌పాల్ సింగ్ 30వ ఏటనే ఖలిస్థాని సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడయ్యాడు. వారిస్ పంజాబ్ దే చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత వేర్పాటువాద సెంటిమెంట్లపై ప్రచారం సాగించడం ప్రారంభించాడు. 2022 సెప్టెంబర్ 29న మోగా జిల్లాలోని రోడె గ్రామంలో (బింద్రన్ వాలా స్వగ్రామం) జరిగిన ఒక కార్యక్రమంలో అమృత్‌పాల్‌ను 'వారిస్ పంజాబ్ దే చీఫ్‌'గా ఆయన మద్దతుదారులు ప్రకటించారు. అనతరం ఆయన ఆనందపూర్ సాహిబ్‌లో జరిగిన అమృత్ సెర్మనీలో పాలుపంచుకుంటూ బింద్రన్‌వాలే తరహాలో దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాడికల్ యూత్‌ మద్దతు కూడగట్టేందుకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే అభియోగాలు కూడా ఆయనపై ఉన్నాయి.

పంజాబ్ హక్కులు, వారసత్వ పరిరక్షణ కోసం నటుడు, కార్యకర్త దీపక్ సిద్ధూ 'వారిస్ పంజాబ్ దే'ను ప్రారంభించారు. 2021లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో దీపక్ కన్నుమూశారు. అప్పటికి పంజాబ్‌ చేరుకున్న అమృత్‌పాల్‌ను అతని మద్దతుదారులు వారిస్ పంజాబ్ దే చీఫ్‌గా ప్రకటించారు. అయితే, దీప్ సిద్ధూ బంధువులు మాత్రం అమృత్‌పాల్‌ను దూరంగా ఉంచేవారని చెబుతారు. వేర్పాటువాద ప్రచారం కోసం సంస్థను అమృత్‌పాల్ దుర్వినియోగం చేస్తున్నాడని వారు ఆరోపించినట్టు కూడా వార్తలు వచ్చాయి.

మార్చి 18 నుంచి పరారీలో..

'వారిస్ పంజాబ్ దే' సంస్థపై పంజాబ్ పోలీసులు సుమారు మూడు వారాల క్రితం విరుచుకుపడ్డారు. మార్చి 18 నుంచి జరిపిన గాలింపు చర్యల్లో అమృత్‌పాల్ చిక్కినట్టే చిక్కి, తన మద్దతుదారులతో సాయంతో తప్పించుకున్నాడు. అప్పట్నించి పోలీసు బృందాలు అతని కోసం జల్లెడ పడుతున్నా రకరకాల ప్రదేశాలు మారుస్తూ, మారువేషాల్లో తప్పించుకుంటున్నాడు. ఈ కేసులో అమృత్‌పాల్ అంకుల్‌ హర్జిత్ సింగ్, దల్జిత్ సింగ్ కల్సితో సహా 8 మందిని ఎన్ఎస్ఏ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2023-04-07T16:18:52+05:30 IST