Share News

Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు.. విచారణలో తేలిన షాకింగ్ ట్విస్ట్

ABN , First Publish Date - 2023-11-02T15:27:00+05:30 IST

బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. కేరళ సీఎంని చంపేస్తామని చెప్పి..

Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రిని చంపేస్తామంటూ బెదిరింపులు.. విచారణలో తేలిన షాకింగ్ ట్విస్ట్

బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. కేరళ సీఎంని చంపేస్తామని చెప్పి, ఫోన్ కట్ చేసేశారు. దీంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అనే కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ సందర్భంగానే ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఎర్నాకులంకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఈ పనికి పాల్పడ్డాడని విచారణలో తేలింది.


అయితే.. ఇది అనుకోకుండా వచ్చిన ఫోన్ కాల్, తమ అబ్బాయికి ఏమీ తెలియదని ఆ బాలుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. ఆ అబ్బాయే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడా? అని మీడియా ప్రశ్నించగా.. దీనిపై తాము అన్ని కోణాల్లోనూ సమగ్ర విచారణ జరుపుతున్నామని పోలిసులు తెలిపారు. సీఎంని చంపుతామంటూ బెదిరింపులకు ఉపయోగించిన ఫోన్ నంబర్‌పై కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్‌లు 118(బి), 120(ఓ) కింద మ్యూజియం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ ఏడో తరగతి అబ్బాయే ఫోన్ చేశాడా? లేక తెరవెనుక ఎవరైనా ఉన్నారా? అనేది దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కాగా.. ఈ మధ్య ఇలాంటి బెదిరింపులు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా.. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు ఇతర ప్రముఖ తారలకు బెదిరింపులొస్తున్నాయి. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి కూడా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులొచ్చాయి. అది కూడా ఒకసారి కాదు.. నాలుగు రోజుల వ్యవధిలో మూడు సార్లు! తొలుత రూ.20 కోట్లు, తర్వాత రూ.200 కోట్లు, ఆపై రూ.400 కోట్లు ఇవ్వాలంటూ దుండగుడు తన డిమాండ్ పెంచుతూ పోయాడు. తాను అడిగినట్లు రూ.400 కోట్లు ఇవ్వకపోతే.. షూటర్లతో చంపేస్తానని అంబానీని హెచ్చరించాడు. దీనిపై కూడా దర్యాప్తు సాగుతోంది.

Updated Date - 2023-11-02T15:28:04+05:30 IST