Ajay Maken: మా సాయం కోరుతూ మమ్మల్నే ఆక్షేపిస్తారా? కేజ్రీవాల్పై ఫైర్..!
ABN , First Publish Date - 2023-06-25T20:48:20+05:30 IST
విపక్షాల ఐక్యతపై ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' నేత అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల ఐక్యతను వేగవంతం చేసేలా కేజ్రీవాల్ ప్రకటనలు లేవని, విపక్ష ఐక్యతా యత్నాలను దెబ్బతీసి బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు.
న్యూఢిల్లీ: విపక్షాల ఐక్యతపై ఢిల్లీ ముఖ్యమంత్రి, 'ఆప్' నేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేస్తున్న ప్రకటనలపై కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకన్ (Ajan Maken) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాల ఐక్యతను వేగవంతం చేసేలా కేజ్రీవాల్ ప్రకటనలు లేవని, విపక్ష ఐక్యతా యత్నాలను దెబ్బతీసి బీజేపీకి మేలు చేయడమే లక్ష్యంగా ఉన్నాయని ఆరోపించారు. ఆర్డినెన్స్పై ఓవైపు కాంగ్రెస్ సాయం ఆశిస్తున్నట్టు కనిపిస్తూనే, మరోవైపు నిస్సిగ్గుగా తమ పార్టీ చీఫ్లను ఆప్ అపహాస్యం చేస్తోందని అన్నారు.
''ఆయన మంత్రులు మా సాయానికి ముందస్తు విజ్ఞప్తులు చేశారు. మరోవైపు విపక్ష పార్టీల సమావేశం రోజే ఆప్ ప్రతినిధి బహిరంగానే మాపై (కాంగ్రెస్) విమర్శలు గుప్పించారు. అలయెన్స్ కోరుకునే పద్దతి ఇదేనా అని కేజ్రీవాల్ అడుగుతున్నాను'' అని మాకెన్ ట్వీట్ చేశారు. ఆర్డినెన్స్పై కేజ్రీవాల్ తమ మద్దతు కోరుతున్నారనీ, ఇదే సమయంలో రాజస్థాన్లోని తమ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ను విమర్శిస్తు్న్నారని, ఇదేం పద్ధతని నిలదీశారు. గత కొద్ది వారాలుగా కేజ్రీవాల్ రాజకీయ యుక్తులు అనేక సందేహాలకు తావిస్తున్నాయని అన్నారు. అవినీతి ఆరోపణలపై ఆయన సహచరులిద్దరు జైలుకు వెళ్లారని, తాను అరెస్టు కాకుండా తప్పించుకునేందుకు కేజ్రీవాల్ ఎదతెరిపిలేని ప్రయత్నాలు చేస్తున్నారని మాకెన్ ఆరోపించారు. ఇందులో భాగంగానే బీజేపీకి ఫేవర్ చేసేందుకు విపక్షా ఐక్యతా యత్నాలను దెబ్బతీసే ప్రయత్నాలు కేజ్రీవాల్ చేస్తున్నారని ఆరోపించారు. విపక్షాల ఐక్యతను వేగవంతం చేసేలా ఆయన చర్యలు లేవని తప్పుపట్టారు.
అవినీతి సొమ్ముతో...
కేజ్రీవాల్ అవినీతి సొమ్ములతో పలు రాష్ట్రాల్లో ప్రచారం సాగించి, కాంగ్రెస్ను దెబ్బయడం ద్వారా బీజేపీకి మేలు చేశారని మాకెన్ విమర్శించారు. ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, అన్నా ఉద్యమ వ్యవస్థాపకులను కేజ్రీవాల్ వంచించిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కేవలం బీజేపీకి సాయపడేందుకే అవినీతి సొమ్ములను గోవా, గుజరాత్, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, అస్సాం ఎన్నికల్లో ఆప్ ఖర్చు చేసి కాంగ్రెస్ను దెబ్బతీసిందని, ఈ విషయాన్ని తాము ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. సామాన్య వ్యక్తినని (ఆమ్ ఆద్మీ) చెప్పుకుంటూ తన కోసం విలాసవంతమైన భవనం నిర్మించుకుని రూ.171 కోట్ల ప్రజాధనాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారని మాకెన్ ఘాటుగా విమర్శించారు.