Share News

Chandrayaan-3: ‘చంద్రయాన్-3’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్.. అదే జరిగితే చరిత్ర సృష్టించినట్టే!

ABN , First Publish Date - 2023-10-20T22:14:09+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అయినప్పటి నుంచి..

Chandrayaan-3: ‘చంద్రయాన్-3’పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్.. అదే జరిగితే చరిత్ర సృష్టించినట్టే!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్ట్ ప్రస్తుతం చంద్రుని ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. చంద్రునిపై తిరిగి సూర్యోదయం అయినప్పటి నుంచి.. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను తిరిగి మేల్కొలిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు గట్టిగానే ప్రయత్నించారు. కానీ.. వాటి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆశలు సన్నగిల్లాయి. రోజులు గడిచినా రెస్పాన్స్ లేకపోవడంతో.. ఇక్కడితో ఈ ప్రాజెక్ట్ కథ ముగిసినట్టేనని అంతా అనుకున్నారు. అవి తిరిగి మేల్కొంటాయనే ఆశలు ఏమాత్రం లేదని కొందరు శాస్త్రవేత్తలు సైతం తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.


ఇలాంటి తరుణంలో.. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ అందరిలోనూ జోష్ నింపే అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం స్లీప్ మోడ్‌లో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్ తిరిగి క్రియాశీలమయ్యే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అన్నారు. ప్రస్తుతం రోవర్ చంద్రుని ఉపరితలంపై ప్రశాంతంగా నిద్రపోతోందని, దాన్ని అలాగే పడుకోనివ్వండని.. మనం దానిని కదిలించొద్దని చెప్పారు. తనంతట తాను నిద్ర నుంచి మేల్కోవాలని అనుకుంటే అది మేల్కొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వద్ద తాము రోవర్‌ను పరీక్షించినప్పుడు.. అది తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తుందని తాము గుర్తించామని తెలిపారు. రోవర్ తిరిగి మేల్కొంటుందని ఆశలు పెట్టుకోవడానికి ఇదే కారణమన్నారు. అయితే.. ల్యాండర్ భారీ నిర్మాణం కావడంతో దాన్ని పూర్తిగా పరీక్షించలేమని వెల్లడించారు.

చంద్రుని ఉపరితలంపై ల్యాండర్, రోవర్‌లు 14 రోజుల పాటు విజయవంతంగా ప్రయోగాలు చేసిన అనంతరం నిద్రాణ స్థితిలోకి పంపించామని.. అవి ఇంకా స్లీప్ మోడ్‌లోనే ఉన్నాయన్న సంగతి ఇస్రోకి బాగా తెలుసని సోమనాథ్ పేర్కొన్నారు. చంద్రునిపై అవి కలెక్ట్ చేసిన డేటాను తాము సేకరించామని అన్నారు. ప్రస్తుతానికి ఈ మిషన్ లక్ష్యం పూర్తయ్యిందన్న ఆయన.. ఈ మిషన్ ద్వారా సేకరించిన శాస్త్రీయ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇస్రో ప్రయత్నిస్తోందని వివరించారు.

Updated Date - 2023-10-20T22:14:09+05:30 IST