IMD: 19 జిల్లాలకు భారీ వర్షసూచన

ABN , First Publish Date - 2023-07-04T07:41:03+05:30 IST

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి, దక్షిణ గాలుల వేగంలో మార్పుల కారణంగా మంగళవారం నుంచి నాలు

IMD: 19 జిల్లాలకు భారీ వర్షసూచన

- నీలగిరి జిల్లాకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం

పెరంబూర్‌(చెన్నై): నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి, దక్షిణ గాలుల వేగంలో మార్పుల కారణంగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని 19 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో వేసవి సీజన్‌ ముగిసినా ఎండ తీవ్రత తగ్గలేదు. అదే సమయంలో ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఈనెల 4న మంగళవారం నుంచి నీలగిరి, కోయంబత్తూర్‌(Nilgiris, Coimbatore) జిల్లాల్లో అతిభారీ వర్షం, తిరుప్పూర్‌, దిండుగల్‌, తేని, తెన్‌కాశి, తిరునల్వేలి, కన్నియాకుమారి, తిరువళ్లూర్‌, చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు, రాణిపేట, తిరుపత్తూర్‌, తిరువణ్ణామలై, విల్లుపురం(Tirupattur, Thiruvannamalai, Villupuram), కడలూరు తదితర 19 జిల్లాలు, పుదుచ్చేరిలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన అతి భారీ వర్షం నమోదయ్యే అవకాశముంది. ముఖ్యంగా, నీలగిరి జిల్లాలో 21 సెం.మీ వర్షం కురిసే అవకాశముందని, ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే, మట్టి చెరియలు విరిగి పడడం, వరదలు సంభవించే అవకాశమున్నందున జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కాగా, వాతావరణం కేంద్రం హెచ్చరికలతో అరక్కోణం నుంచి 40 మంది సభ్యుల జాతీయ విపత్తుల నివారణ బృందం (ఎన్డీఆర్‌ఎఫ్‌) నీలగిరి జిల్లాకు బయల్దేరింది. మరోవైపు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని కడలూరు జిల్లా మత్స్యకారులకు ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం రాత్రి నుంచే చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో చెదరుమదురు వర్షం పడుతోంది.

nani1.jpg

Updated Date - 2023-07-04T07:41:03+05:30 IST