Howrah Violence: సెక్షన్ 144 పొడిగింపు, రంగంలోకి సీఐడీ...

ABN , First Publish Date - 2023-04-01T12:21:58+05:30 IST

శ్రీరామ నవవి శోభాయాత్ర సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలతో అట్టుడికిన హౌరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో..

Howrah Violence: సెక్షన్ 144 పొడిగింపు, రంగంలోకి సీఐడీ...

హౌరా: శ్రీరామ నవవి శోభాయాత్ర సందర్భంగా ఇరువర్గాల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనలతో అట్టుడికిన హౌరా ( Howrah) జిల్లాలోని పలు ప్రాంతాల్లో సెక్షన్ 144ను ఏప్రిల్ 3వ తేదీ వరకూ పొడిగించారు. పోలీసులపై స్థానికులు రాళ్లురువ్విన తాజా ఘటనలు శుక్రవారం మరోసారి తలెత్తడటంతో ఘర్షణలు జరిగిన ప్రాంతంలో నిషేధ ఉత్తర్వులు అమల్లోకి తెచ్చారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అయితే అల్లర్లకు కేంద్ర స్థానమైన కాజీపురాలో పరిస్థితి శనివారంనాడు అదుపులోనికి వచ్చింది. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో ఉదయం నుంచి దుకాణాలు, మార్కెట్లు తెరుచుకున్నాయి. యథాప్రకారం వాహనాల రాకపోకలు జరుగుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు.

సీఐడీకి విచారణ అప్పగింత..

హౌరాలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై విచారణను సీఐడీ చేపట్టింది. అయితే, పశ్చిమబెంగాల్ బీజేపీ లోక్‌సభ ఎంపీ జగన్నాథ్ సర్కార్ శనివారంనాడు కేంద్ర సర్కార్ జోక్యాన్ని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఘర్షణలు విస్తరించకుండా కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని, అల్లర్ల ఘటనలపై ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. గురువారం హౌరా పట్టంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో అల్లరిమూకలు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు పలు దుకాణాలను లూటీ చేశారు, వాహనాలకు నిప్పుపెట్టారు. పలు పోలీసు వాహనాలు సైతం అగ్నికి ఆహుతయ్యాయి. కాజీపురా హింసాత్మక ఘటనల వెనుక బీజేపీ, రైట్ వింగ్ సంస్థల ప్రమేయం ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చడంతో పాటు ఎన్ఐఏతో విచారణకు డిమాండ్ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్‌కు ఫోన్ చేసి హింసాత్మక ఘటనలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మంజుందార్‌తోనూ సంప్రదించారు.

Updated Date - 2023-04-01T12:21:58+05:30 IST