Adani Group Vs Hindenburg : అదానీ గ్రూప్‌పై మరోసారి విరుచుకుపడిన హిండెన్‌బర్గ్

ABN , First Publish Date - 2023-01-30T13:14:00+05:30 IST

అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేస్తున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సోమవారం మళ్లీ విరుచుకుపడింది.

Adani Group Vs Hindenburg : అదానీ గ్రూప్‌పై మరోసారి విరుచుకుపడిన హిండెన్‌బర్గ్
Gautam Adani

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌ను అతలాకుతలం చేస్తున్న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research) సోమవారం మళ్లీ విరుచుకుపడింది. ముఖ్యమైన సమస్యల నుంచి దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నిస్తూ, జాతీయవాద దృక్పథాన్ని లేవనెత్తుతోందని అదానీ గ్రూప్‌పై ఆరోపణలు గుప్పించింది. ఈ గ్రూప్ తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధిని, దాని చైర్మన్ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోందని దుయ్యబట్టింది.

హిండెన్‌బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ (Adani Group) ఆదివారం సమాధానం చెప్తూ, అమెరికన్ షార్ట్ సెల్లర్స్ ‘మడాఫ్స్ ఆఫ్ మన్‌హటన్’ (Madoffs of Manhattan) అని ఆరోపించింది. అమెరికన్ మోసగాడు, ఫైనాన్షియర్ బెర్నార్డ్ లారెన్స్ మడాఫ్ ప్రపంచ చరిత్రలో అతి పెద్ద పోంజీ కుంభకోణానికి పాల్పడిన విషయాన్ని గుర్తు చేసింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బయటకు చెప్పని కారణాలతో ఈ ఆరోపణలు చేసిందని 413 పేజీలతో కూడిన ఈ సమాధానంలో పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఫాల్స్ మార్కెట్‌ను సృష్టించాలనే రహస్య ఎజెండా హిండెన్‌బర్గ్‌కు ఉందని ఆరోపించింది.

అదానీ గ్రూప్ సీఎఫ్ఓ జుగెషిందర్ సింగ్ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ, హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని, తప్పుదోవ పట్టించేవని ఆరోపించారు.

అదానీ గ్రూప్ ఇచ్చిన సమాధానంతో ఏకీభవించడం లేదని హిండెన్‌బర్గ్ తెలిపింది. భారత దేశం శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశమని, సూపర్ పవర్‌గా ఎదుగుతోందని, ఆ దేశానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని చెప్పింది. అదే సమయంలో అదానీ గ్రూప్ భారత దేశ భవిష్యత్తును వెనుకకు లాగుతోందని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపింది. భారత దేశ జెండాను కప్పుకుని, దేశాన్ని పద్ధతి ప్రకారం దోచుకుంటోందని ఆరోపించింది.

ప్రపంచంలోని సంపన్నుల్లో ఒకరు మోసం చేసినప్పటికీ, మోసం మోసమేనని తెలిపింది. అదానీ గ్రూప్ ఇచ్చిన సమాధానంలో కేవలం 30 పేజీల్లో మాత్రమే తాము లేవనెత్తిన అంశాలపై దృష్టి పెట్టిందని, మిగిలినదంతా కోర్టు రికార్డులు, సాధారణ సమాచారం, సంబంధంలేని ఇతర విషయాలేనని పేర్కొంది.

Updated Date - 2023-01-30T13:14:09+05:30 IST