Karnataka Results: కర్ణాటకలో ‘గుజరాత్‌ ఫార్ములా’ అట్టర్‌ఫ్లాప్‌

ABN , First Publish Date - 2023-05-13T20:07:53+05:30 IST

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల (Gujarat Assembly Elections) తరహాలోనే కర్ణాటకలోనూ బీజేపీ వ్యూహాత్మకంగా 75 కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది.

Karnataka Results: కర్ణాటకలో ‘గుజరాత్‌ ఫార్ములా’ అట్టర్‌ఫ్లాప్‌

బెంగళూరు: గుజరాత్‌ శాసనసభ ఎన్నికల (Gujarat Assembly Elections) తరహాలోనే కర్ణాటకలోనూ బీజేపీ వ్యూహాత్మకంగా 75 కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చింది. వారిలో కేవలం 14 మంది మాత్రమే గట్టెక్కారు. అదీ.. బొటాబొటి మెజార్టీతో గెలిచారు. బీజేపీ ఈసారి టికెట్‌ నిరాకరించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్‌, జేడీఎస్‌ (Congress JDS)లో చేరి ఘన విజయం సాధించడం మరో విశేషం. పార్టీ ఘోర పరాజయాలకు ఇదొక ప్రధాన కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టికెట్ల కేటాయింపు వ్యవహారంలో బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి చక్రం తిప్పి అధిష్టానాన్ని తప్పుదారి పట్టించారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. సిట్టింగులకే ఒకవేళ టికెట్లు ఇచ్చి ఉంటే పార్టీ పరిస్థితి మరో విధంగా ఉండేదన్న అభిప్రాయం ఉంది.

అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించగా, బీజేపీ మాత్రం గుజరాత్‌ ఫార్ములాను ప్రయోగించి చతికిలపడిందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) బీజేపీ(BJP) ముస్లింలకు ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు. ముస్లింల ఓట్లు అధికంగా ఉండి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఆ సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వపోవడం గమనార్హం. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లోనూ ముస్లింలకు టికెట్‌ ఇవ్వరాదని బీజేపీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే ఫార్ములాను కర్ణాటకలో వరుసగా రెండోసారి అమలు చేశారు.

ఎన్నికలకు ఏడాది ముందు కర్ణాటక బీజేపీ నేతలు ఏదో ఒక మత సంబంధమైన అంశాలను వివాదాస్పదంగా లేవనెత్తుతూ వచ్చారు. హలాల్, హిజాబ్, అజాన్‌తోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల తర్వాత ‘బజరంగ్ దళ్’ అంశాన్ని కూడా రాజకీయాస్త్రంగా వాడుకున్నారు. అయితే మతపరమైన ఈ అంశాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించినప్పటికీ కర్ణాటకలో బీజేపీకి ఏమాత్రం సానుకూలమవ్వలేదు. అలాగే ఎన్నికల ప్రచారంలో బీజేపీ పలు వాగ్ధానాలు చేసింది. ముఖ్యంగా ఆధిపత్య వర్గాలకు చెందిన ఓట్లను కొల్లగొట్టడమే లక్ష్యంగా పలు హామీలు గుప్పించింది. ఈ వాగ్ధానాలను లింగాయత్ వర్గం విశ్వసించలేదు.

అంతేకాదు దళిత్, ఆదివాసి, ఓబీసీతోపాటు వక్కలింగా ఓట్లు కూడా బీజేపీకి దూరమయ్యాయి. ఇదే సమయంలో ముస్లిం, దళితులు, ఓబీసీల ఓటర్లను తమవైపు నిలుపుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. లింగాయత్‌లు కూడా కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుచూపేలా కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా వ్యహరించడం బీజేపీకి మైనస్ అయ్యింది. కర్ణాటక బీజేపీలో అత్యంత కీలకమైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఈ ఎన్నికల్లో అంత చురుకుగా పాల్గొనలేదు. ఈయన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. యడియూరప్పను ముందు పెట్టి లింగాయత్‌ ఓట్లను కొల్లగొట్టాలని బీజేపీ ప్లాన్ వేసింది. ఈ పథకం బీజేపీకి కలిసిరాలేదు. బీజేపీ అవినీతిని ఎత్తిచూపుతూ ‘40 శాతం కమిషన్ ప్రభుత్వం’ అంటూ కాంగ్రెస్ సాగించిన ప్రచారం ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది. బీజేపీ అవినీతిని ఎండగడుతూ కాంగ్రెస్ చేసిన ఈ నినాదం క్రమంగా జనాల్లోకి ప్రబలంగా వెళ్లింది. అయినా కర్ణాటకలో బీజేపీకి ఏమాత్రం కలిసి రాలేదని ఫలితాలను చూస్తే స్పష్టమవుతోంది.

Updated Date - 2023-05-13T20:07:53+05:30 IST