Letters War: రాష్ట్రపతి పాలన పేరుతో గవర్నర్ బెదిరిస్తున్నారు: సీఎం భగవంత్ మాన్

ABN , First Publish Date - 2023-08-26T18:01:54+05:30 IST

శాంతిని కోరుకునే పంజాబ్ ప్రజలను గవర్నర్ బెదిరిస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తామని హెచ్చరిస్తూ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ నకు రాసిన లేఖపై భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని చెప్పారు.

Letters War: రాష్ట్రపతి పాలన పేరుతో గవర్నర్ బెదిరిస్తున్నారు: సీఎం భగవంత్ మాన్

ఛండీగఢ్: శాంతిని కోరుకునే పంజాబ్ ప్రజలను గవర్నర్ బెదిరిస్తున్నారని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (Bhagwant Mann) అన్నారు. రాష్ట్రపతి పాలన విధిస్తామని హెచ్చరిస్తూ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ (Banwarilal Purohit) తనకు రాసిన లేఖపై భగవంత్ మాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. గవర్నర్ రాసిన మెజారిటీ లేఖలకు తాను సమాధానం ఇచ్చినట్టు తెలిపారు.


''శాంతికాముకులైన పంజాబ్ ప్రజలను గవర్నర్ శుక్రవారంనాడు బెదిరిస్తూ రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ మాట్లాడారు. శాంతిభద్రతల విషయంపై గవర్నర్ ప్రశ్నలు లేవనెత్తారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు ఎంతో పని చేసింది. ఒక్క ఆగస్టులోనే 41 కిలోల హెరాయిన్‌ను పట్టుకున్నాం. ఇంతవరకూ 753 మంది గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేశాం. 786 ఆయుధాలు, వాహనాలు స్వాధీనం చేసుకున్నాం. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి'' అని భగవంత్ మాన్ తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రామీణాభివృద్ధి నిధుల గురించి బన్విరిలాల్ పురోషిత్ కేంద్రానికి లేఖ రాసి ఉంటే బాగుండేదని అన్నారు.


16 లేఖల్లో తొమ్మిదింటికి సమాధానమిచ్చా...

గవర్నర్ తనకు రాసిన 16 లేఖల్లో 9 లేఖలకు ఇప్పటికే సమాధానమిచ్చానని, త్వరలోనే తక్కినవాటికి కూడా జవాబిస్తానని, ఎందుకు ఇంత తొందరని సీఎం ప్రశ్నించారు. పంజాబ్‌కు రావాల్సిన ఆర్‌డీఎఫ్ గురించి ఆయన ఎప్పుడైనా లేఖ రాశారా? కనీసం రైతుల అంశంపై అడిగారా? పంజాబ్‌తో ఎప్పుడైనా మీరు ఉన్నారా? అని గవర్నర్‌ను ఆయన నిలదీశారు. ఆయన రాసిన లేఖల్లో అధికర దాహం కనిపిస్తోందని, గవర్నర్ నాగపూర్ నుంచి వచ్చారని, ఇదే సమయంలో ఆయన రాజస్థాన్‌కు కూడా చెందిన వారని అన్నారు. అక్కడ ఎన్నికలు వస్తున్నాయని, ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి కావచ్చని మాన్ సూచించారు. పంజాబ్ అసలే వరద నష్టల్లో ఉందని, కాస్తకాస్తగా ఆ నష్టాన్ని భర్తీ చేసుకుంటున్నామని, తమ దగ్గర ఎస్‌డీఆర్ఎఫ్ కింద రూ.9,600 కోట్లు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ కఠిన నిబంధనల కారణంగా వాటిని పంజాబ్ ప్రజలకు ఇవ్వలేకపోతున్నామని మాన్ వాపోయారు.


గవర్నర్ వార్నింగ్...

కాగా, దీనికి ముందు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో బన్వరిలాల్ పురోహిత్ ఘాటు హెచ్చరికలు చేశారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని, తన లేఖలకు సమాధానం ఇవ్వకుంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజ్యాం యంత్రాగ వైఫల్యం కనిపిస్తోందని, అది తనకు ఆవేదన కలిగిస్తోందని సీఎంకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయడం, ఐపీసీ సెక్షన్ 124 కింద నేరపూరిత చర్యలను ప్రారంభించడంపై తాను తుది నిర్ణయానికి రాక ముందే పలు లేఖల ద్వారా అడిగిన సమాచారాన్ని అందజేయాలని సీఎంను గవర్నర్ కోరారు.

Updated Date - 2023-08-26T18:04:14+05:30 IST