Governor: నాగూరు దర్గాలో గవర్నర్ ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Dec 24 , 2023 | 08:40 AM
నాగపట్టినం జిల్లాలో సుప్రసిద్ధ నాగూరు దర్గా గంధ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- నల్లజెండాలు ప్రదర్శించిన వందమంది అరెస్టు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): నాగపట్టినం జిల్లాలో సుప్రసిద్ధ నాగూరు దర్గా గంధ మహోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి(Governor RN Ravi) శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ దర్గాలో 467వ గంధమహోత్సవం ఈ నెల 14న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఉత్సవాల్లో కీలక ఘట్టమైన గంధ పాత్ర ఊరేగింపు శనివారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు గవర్నర్ రవి చెన్నై నుంచి విమానంలో తిరుచ్చికి వెళ్లారు. అక్కడి నుంచి కారులో నాగూరు దర్గాను చేరుకున్నారు. దర్గా నిర్వాహకులు, జిల్లా కలెక్టర్ జానీటాం వర్గీస్ తదితర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన దర్గాలోపలకు వెళ్లి ఇటీవల తుఫానుకు, వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థించారు.
నల్లజెండాల ప్రదర్శన... : ప్రభుత్వ బిల్లులను పెండింగ్లో ఉంచడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్, డీపీఐ, సీపీఐ, మనిదనేయ మక్కల్ కట్చి కార్యకర్తలు గవర్నర్కు నల్లజెండాలతో స్వాగతం పలికేందుకు ప్రయత్నించారు. కీళ్వేలూరులో జిల్లా కాంగ్రెస్ నేత అమృతరాజ్ నాయకత్వంలో మిత్రపక్షాలకు చెందిన కార్యకర్తలు నల్లజెండాలతో గవర్నర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్తున్న రహదారిలో చొరబడటానికి ప్రయత్నించారు. వీరి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. చివరకు పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కార్యకర్తలను అరెస్టు చేశారు.
