Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2023-07-28T13:28:02+05:30 IST

భారతీయ జనతా పార్టీ నాయకులు హిందుత్వ అని నినాదాలు చేయడమేగాని దేవాలయాల అభివృద్ధికి ఎంతమాత్రం కృషిచేయడం లేదని కర్ణాటక

Gali Janardhan Reddy: గాలి జనార్దన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారంటే...

బళ్లారి(బెంగళూరు), (ఆంధ్రజ్యోతి): భారతీయ జనతా పార్టీ నాయకులు హిందుత్వ అని నినాదాలు చేయడమేగాని దేవాలయాల అభివృద్ధికి ఎంతమాత్రం కృషిచేయడం లేదని కర్ణాటక రాజ్య ప్రగతి పార్టీ(కేఆర్‌పీపీ)వ్యవస్థాపకులు, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి(Gali Janardhan Reddy) ఆరోపించారు. కొప్పళ జిల్లాలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అలాగే గతంలో రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉండేదని అప్పుడు దేవాలయాల అభివృద్ధికి ఎన్ని నిధులు ఇచ్చారో చూపాలన్నారు. పురాణాల ప్రకారం అంజనేయుడు పుట్టిన స్థలం అని చెబుతున్న అంజనాద్రిని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)ను కలిసి అంజనాద్రి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అంజనాద్రికి అనేక రాష్ట్రాలు, దేశాల నుండి ఎంతో మంది భక్తులు వస్తున్నారని, వారికి కనీస వసతి సౌకర్యాలు లేవన్నారు. ఇందుకు ప్రత్యేక నిధులు కేటాయించి అక్కడే కల్యాణ మంటపాలు, నివాస సత్రాలు నిర్మించాలని సిద్దరామయ్యను కోరినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-28T13:28:03+05:30 IST