Former CM: మాజీ సీఎం జోస్యం.. 40 స్థానాల్లో మా పార్టీ కూటమి విజయం ఖాయం..
ABN , Publish Date - Dec 22 , 2023 | 07:51 AM
వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమి తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 40 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని
అడయార్(చెన్నై): వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే సారథ్యంలోని కూటమి తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 40 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని మాజీసీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి(Edappadi K. Palaniswami) జోస్యం చెప్పారు. పురట్చిభారతం పార్టీ ఆధ్వర్యంలో విల్లుపురంలోని డాక్టర్ అంబేద్కర్ మైదానంలో జరిగిన మహానాడుకు ఎడప్పాడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, శరీరం - ప్రాణం తరహాలో అన్నాడీఎంకే - పురట్చిభారతం పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ రెండు పార్టీలను ఏ శక్తీ విడదీయలేదన్నారు. 46 యేళ్ళుగా ఒక పార్టీ అణగారిన ప్రజల కోసం కృషి చేయడం సాధారణమైన విషయం కాదన్నారు. అలా శ్రమిస్తున్న పార్టీ పురట్చిభారతం ఒకటన్నారు. అన్నాడీఎంకే కూటమి ప్రజల క్షేమాన్ని కాంక్షిచే పార్టీ అని చెప్పారు. ఈ పార్టీలో ఎవరైన ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. మిత్రపక్ష పార్టీలను ప్రోత్సహిస్తూ వాటి అభవృద్ధికి పాటుపడే పార్టీనే అన్నాడీఎంకే అని చెప్పారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్సభ స్థానంతో కలిపి మొత్తం 40 సీట్లలో విజయభేరీ మోగిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కాగా, ఈ మహానాడులో పురట్చి భారతం పార్టీ అధ్యక్షుడు కేవీ కుప్పం, ఎమ్మెల్యే పూవై జగన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.