EVS ilangovan: 34 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా మళ్లీ అసెంబ్లీకి..!
ABN , First Publish Date - 2023-03-03T12:27:01+05:30 IST
ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఈవీకేఎస్ ఇళంగోవన్(EVKS Ilangovan) 34 ఏళ్ల తర్వాత శాసనసభలో
అడయార్(చెన్నై): ఈరోడ్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఈవీకేఎస్ ఇళంగోవన్(EVKS Ilangovan) 34 ఏళ్ల తర్వాత శాసనసభలో అడుగుపెట్టనున్నారు. తందై పెరియార్ మనవడు, డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాకు పక్కబలంగా ఉంటూ ‘చోళిన్ సెల్వర్’గా పిలువడిన ఈవీకేఎస్ సంపత్ పెద్ద కుమారుడు ఈవీకేఎస్ ఇళంగోవన్. చెన్నై(Chennai) రాజదాని కళాశాలలో ఆర్ధికం చదివిన ఇళంగోవన్, యువజన కాంగ్రెస్లో చురుకైన నాయకుడిగా పనిచేశారు. 1984లో సత్యమంగళం నియోజకవర్గంలో పోటీచేసి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. రెండు సార్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఒక పర్యాయము కార్యాచరణ అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2004లో గోపిచెట్టిపాళయం పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి, మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో జౌళి, వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బీజేపీ(BJP) ప్రభుత్వం తీసుకొచ్చిన జౌళి వృత్తిపై విధించిన పన్ను నిలిపివేసి, ఆ రంగాన్ని అభివృద్ధి చేశారన్న ఖ్యాతి ఇళంగోవన్కు దక్కింది. 2009, 2019లో పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2021 శాసనసభ ఎన్నికల్లో ఇళంగోవన్ కుమారుడు తిరుమగన్ ఈవేరా ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో పోటీచేసి విజయం సాధించారు. కాగా జనవరి 4వ తేది తిరుమగన్ ఈవేరా మృతిచెందడంతో, జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన తండ్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ విజయం సాధించారు. ఆ ప్రకారం 34 ఏళ్ల అనంతరం ఆయన మళ్లీ తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.