Electricity charges: రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం.. విద్యుత్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వలు
ABN , First Publish Date - 2023-07-02T09:24:32+05:30 IST
రాష్ట్రంలో వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పెంచిన విద్యుత్ ఛార్జీలు(Electricity charges) శనివారం నుండి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు పెంచిన విద్యుత్ ఛార్జీలు(Electricity charges) శనివారం నుండి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను ప్రతియేడాది జూలై 1న పెంచాలని విద్యుత్ నియంత్రణా మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఈ యేడాది విద్యుత్ ఛార్జీలను 4.7 శాతం వరకూ పెంచాల్సి ఉన్నప్పటికీ, గత యేడాది సెప్టెంబర్లో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడంతో చార్జీల పెంపు శాతాన్ని 4.7 శాతం నుండి 2.18 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం ప్రకారం ఇళ్లకు కూడా విద్యుత్ ఛార్జీలను స్వల్పంగా పెంచాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే విధంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు, పంపుసెట్లకు, గుడిసెలకున్న విద్యుత్ కనెక్షన్లకు ఛార్జీలను పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్బోర్డుకు అవసరమైనంతగా సబ్సిడీని అందించడానికి సిద్ధమైంది. ఈ పరిస్థితులలో ప్రస్తుతం వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు మాత్రమే విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. యూనిట్కు 13 నుండి 21 పైసల దాకా విద్యుత్ ఛార్జీలను పెంచింది. ఈ మేరకు వాణిజ్య సంస్థలకు వందయూనిట్ల వరకు ఛార్జీని రూ.600 నుండి రూ.615 వరకు, 200 యూనిట్లకు రూ.1900 నుండి రూ.1940కు, 300 యూనిట్లకు రూ.2850 నుండి రూ.2910కు పెంచారు. ఇదే విధంగా 400 యూనిట్ల వరకు ఛార్జీని రూ.3800 నుండి రూ.3880కి, 500 యూనిట్ల వరకు రూ.4750 నుండి రూ.4850లకు, 600ల యూనిట్ల వరకు రూ.5700 నుండి రూ.5820కు పెంచారు. ఇక వెయ్యి యూనిట్ల వరకు ఛార్జీని రూ.9500 నుండి రూ.9700కు పెంచారు.