DGP: నూతన డీజీపీగా శంకర్ జివాల్
ABN , First Publish Date - 2023-06-30T08:20:15+05:30 IST
రాష్ట్ర పోలీసు శాఖ 31వ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంకర్ జివాల్(Shankar Jival)ను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిప
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు శాఖ 31వ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి శంకర్ జివాల్(Shankar Jival)ను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అముదా గురువారం సాయంత్రం ఉత్తర్వులిచ్చారు. డీజీపీగా సేవలందించిన డాక్టర్ శైలేంద్రబాబు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన స్థానంలో గ్రేటర్చెన్నై పోలీసు కమిషనర్గా శంకర్ జివాల్ నియమితులయ్యారు. రాష్ట్ర పోలీసు శాఖలో డీజీపీ ర్యాంకులో ఉన్న 13 మంది అధికారులు డీజీపీ పోస్టుకు అర్హులు కాగా, వారిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసేందుకు ఢిల్లీలోని యూపీఎస్సీ బోర్డులో గత 22న నమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆ 13 మంది పేర్లను పరిశీలించారు. ఆ సమావేశంలో కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు, యూపీఎస్సీ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అముదా, డీజీపీ శైలేంద్రబాబు(DGP Shailendra Babu) తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీనియారిటీ సహా పలు అర్హతల ఆధారంగా తమిళనాడు కేడర్ అధికారిగా ఉన్న ఢిల్లీ పోలీసు కమిషనర్గా ఉన్న సంజయ్ అరోరా, శంకర్జివాల్, హోంగార్డు డీజీపీ బ్రిజ్కిశోర్ రవి పేర్లను ఎంపికచేశారు. ఈ ముగ్గురిలో ఒకరిని డీజీపీగా ఎంపిక చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. వీరిలో శంకర్జివాల్ను డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. డీజీపీగా నియమితులైన శంకర్ జివాల్కు రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
శంకర్జివాల్ విశేషాలు...
ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన శంకర్ జివాల్ బీఈ మెకానికల్ చదివారు. అదే విభాగంలో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. కుమానీ మాతృభాష కలిగిన శంకర్జివాల్ తమిళం, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యత సాధించారు. కళాశాల విద్యఅనంతరం ఆయన సెయిల్, భెల్ సంస్థల్లో కొంతకాలం ఇంజనీర్గా పనిచేశారు. 1990వ సంవత్సరం సివిల్స్ రాసి ఐపీఎస్ సాధించి రాష్ట్ర పోలీసు శాఖలో ఏఎస్పీగా సేవలను ప్రారంభించారు. ఆయన సేలం, మదురై జిల్లాల ఎస్పీగా పనిచేసి నేరాల అధుపునకు కృషి చేశారు.. కేంద్ర మాదక ద్రవ్యాల నిరోధక విభాగంలో జోనల్ డైరెక్టర్, తిరుచ్చి నగర పోలీసు కమిషనర్, ఇంటెలిజెన్స్ డీఐజీ, ఐజీ, ఎస్టీఎఫ్ విభాగం ఏడీజీపీ, సీఆర్పీఎఫ్ ఏడీజీపీ తదితర పలు పదవులలో సేవలందించారు. శంకర్జివాల్ రెండు సార్లు రాష్ట్రపతి పతకాలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు.