MCD mayor elections: నామినేటెడ్ మెంబర్లకు ఓటింగ్‌పై సుప్రీం సంచలన నిర్ణయం

ABN , First Publish Date - 2023-02-17T17:29:43+05:30 IST

ఎంసీడీ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ ..

MCD mayor elections: నామినేటెడ్ మెంబర్లకు ఓటింగ్‌పై సుప్రీం సంచలన నిర్ణయం

న్యూఢిల్లీ: ఎంసీడీ మేయర్ ఎన్నికల (MCD mayor election)పై సుప్రీంకోర్టు (Supreme court) శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన సభ్యులకు ఢిల్లీ మేయర్ పోస్టు ఎన్నికల్లో ఓటింగ్ హక్కు నిరాకరించింది. 24 గంటల్లోగా ఎన్నికల కోసం తొలి ఎంసీడీ సమావేశం ఏర్పాటు చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీకి కీలక ఉపశమనం లభించింది.

ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్, ఎంసీడీ స్టాడింగ్ కమిటీలోని 18 మంది సభ్యులలో ఆరుగురిని ఎన్నుకునేందుకు ఎంసీడీ ఇటీవల మూడుసార్లు సమావేశమైనప్పటికీ ఎన్నికల ప్రక్రియ చేపట్టకుండానే వాయిదా పడ్డాయి. నామినేట్ సభ్యులను ఓటింగ్‌‌కు ఎల్జీ ‌అనుమతించాన్ని ఆప్ వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం, ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో మేయర్ ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీని ఎల్జీ ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కును కల్పించే ఎల్జీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో ఆప్ సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నామినేట్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నిర్ణయం ప్రకటించింది.

50 స్థానాలున్న ఢిల్లీ మున్సిపాలిటీకి గత డిసెంబర్ 4న ఎన్నికలు జరుగగా, డిసెంబర్ 7న ఫలితాలు వెలువడ్డాయి. ఆప్ 134 సీట్లు గెలుచుకుని, మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు అవసరమైన సీట్లు గెలుచుకుంది. బీజేపీ 104 వార్డులు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 9 సీట్లు గెలుచుకుంది. కాగా, ఆప్ తరఫున ఢిల్లీ మేయర్‌ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ పోటీ పడుతున్నారు. బీజేపీ తరఫున రేఖా గుప్తా పోటీ చేస్తు్న్నారు. డిప్యూటీ మేయర్ పదవికి ఆప్ తరఫున అలెయ్ మొహమ్మద్ ఇక్బాల్, బీజేపీ నుంచి కమల్ బాగ్రి పోటీ పడుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు ఎంసీడీ స్టాడింగ్ కమిటీకి 18 మంది సభ్యులలో ఆరుగురు సభ్యులను నేరుగా ఎన్నుకోవాల్సి ఉంది. మిగిలిన 12 మందిని జోనల్ ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కాగా, సంఖ్యాబలం ఆధారంగా కీలకమైన ఆరుగురు సభ్యుల ఎన్నికలో మూడు సీట్లు ఆప్ గెలుచుకోనుండగా, బీజేపీ రెండు సీట్లు దక్కుంచుకోనుంది. కీలకమైన ఆరో సీటు ఆప్-బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు అనుమతిస్తే బీజేపీకి ఆ సీటు దక్కే అవకాశం ఉందని ఆప్‌ ఆందోళన చెందుతోంది. అందుకు అనుగుణంగానే ఎల్జీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది.

ప్రజాస్వామ్య విజయం: కేజ్రీవాల్

ఎంసీడీ మేయర్ ఎన్నికల్లో ఎల్జీ నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కును నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయమని ఓ ట్వీట్ చేశారు. రెండున్నర నెలల తర్వాత ఇప్పుడు ఢిల్లీకి మేయర్ రానున్నారని అన్నారు. ఎల్జీ, బీజేపీ కలిసికట్టుగా ఢిల్లీలో ఎలాంటి అక్రమ, రాజ్యాంగ వ్యతిరేక ఆదేశాలు జారీ చేస్తున్నాయో సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైందని అన్నారు.

Updated Date - 2023-02-17T17:29:45+05:30 IST