Share News

JP Nadda: ఓట్ల కోసం కాంగ్రెస్ రామభక్తుడిగా మారిపోయింది: జేపీ నడ్డా

ABN , First Publish Date - 2023-11-15T22:08:21+05:30 IST

రాముడిని(Lord Rama) ఒకప్పుడు కల్పిత పాత్ర అని పిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం రాముడి భక్తుడిగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ఎద్దేవా చేశారు.

JP Nadda: ఓట్ల కోసం కాంగ్రెస్ రామభక్తుడిగా మారిపోయింది: జేపీ నడ్డా

రాయ్‌పుర్: రాముడిని(Lord Rama) ఒకప్పుడు కల్పిత పాత్ర అని పిలిచిన కాంగ్రెస్ ఇప్పుడు ఓట్ల కోసం రాముడి భక్తుడిగా మారిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda)ఎద్దేవా చేశారు. ఛత్తీస్ గఢ్‌(Chattisgarh)లో చివరి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయ్ పుర్(Raypur) లో ఏర్పాటు చేసిన ర్యాలీలో నడ్డా ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ.. "రాముడు కల్పితమని, ఆయన ఉనికికి శాస్త్రీయ, చారిత్రక ఆధారాలు లేవని కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. కాంగ్రెస్ ఎప్పటికప్పుడు ఊసరవెల్లిలా రంగులు మారుస్తోంది. ఎన్నికలు ఉండటంతో వారు భగవంతున్ని తలచుకుంటున్నారు. కొంతమంది 'జానేయు-ధారి' (బ్రాహ్మణ దారం ధరించేవారు) అయ్యారు. అది ఎలా ధరించాలో కూడా వారికి తెలియదు. వాల్మీకి రామాయణంలో రాముడు ఒక కల్పితం (పాత్ర) అని కాంగ్రెస్ నేతలు గతంలో అన్నారు. ఇప్పుడు రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారు.


అయోధ్యలో రామమందిర నిర్మాణ తేదీని వెల్లడించాలని కాంగ్రెస్ బీజేపీపై ఒత్తిడి చేస్తోంది. దేవుడిపై భక్తిభావాలు ఉండటం వల్లే అయోధ్యలో బీజేపీ హయాంలో రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. కాంగ్రెస్ అంటే కుంభకోణాలు, దోపిడీలు, మోసాలకు పర్యాయపదం. యూపీఏ హయాంలో కాంగ్రెస్(Congress) పార్టీ నేల, ఆకాశం దేన్నీ వదల్లేదు. హెలికాప్టర్ స్కాం, బొగ్గు స్కాం ఇలా అన్ని స్కాంలలో వారి ప్రమేయం ఉంది. మహాదేశ్ బెట్టింగ్ యాప్(Mahadev app betting) నిర్వాహకుల నుంచి ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ముడుపులు తీసుకున్నారు.

అదే కాకుండా మద్యం కుంభకోణం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్, ఆవు పేడ సేకరణ ఇలా అన్నింటిలో బఘేల్ సర్కార్(Bhupesh Bhagel) అవినీతికి పాల్పడింది. భారతీయ జనతా పార్టీ (BJP) అభివృద్ధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం నిలుస్తుంది" అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 22 జిల్లాల్లోని 70 నియోజకవర్గాల్లో శుక్రవారం రెండో విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న జరిగిన మొదటి దశ ఓటింగ్‌లో 20 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.

Updated Date - 2023-11-15T22:08:57+05:30 IST