Share News

CM Stalin: తుఫాను, వరద బాధితులపై సీఎం వరాల జల్లు.. రూ.1000 కోట్లు విడుదల

ABN , Publish Date - Dec 31 , 2023 | 09:07 AM

మిచౌంగ్‌ తుఫాను తాకిడికి, వర్షబీభత్సానికి గురైన చెన్నై, తిరువళ్లూరు, తూత్తుకుడి, తిరునల్వేలి సహా ఎనిమిది జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను, రైతులను, వ్యాపారులను ఆదుకునేందుకు సీఎం స్టాలిన్‌(CM Stalin) రూ.1000 కోట్లు విడుదల చేశారు.

CM Stalin: తుఫాను, వరద బాధితులపై సీఎం వరాల జల్లు.. రూ.1000 కోట్లు విడుదల

- ఇళ్ల నిర్మాణానికి రూ.385 కోట్లు

- చిరువ్యాపారులకు రూ.లక్ష రుణం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మిచౌంగ్‌ తుఫాను తాకిడికి, వర్షబీభత్సానికి గురైన చెన్నై, తిరువళ్లూరు, తూత్తుకుడి, తిరునల్వేలి సహా ఎనిమిది జిల్లాల్లో తీవ్రంగా నష్టపోయిన ప్రజలను, రైతులను, వ్యాపారులను ఆదుకునేందుకు సీఎం స్టాలిన్‌(CM Stalin) రూ.1000 కోట్లు విడుదల చేశారు. తూత్తుకుడి సహా నాలుగు జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఈవీ వేలు, కేకేఎస్ఎస్ఆర్‌ రామచంద్రన్‌, తంగం తెన్నరసు, ఉదయనిధి, గీతా జీవన్‌, అనితా రాధాకృష్ణన్‌, ఆర్‌ఎస్‌ రాజకన్నప్పన్‌, పి.మూర్తి, మనో తంగరాజ్‌ పర్యటించారని, వారి ప్రతిపాదనలను అనుసరించి నిధులు విడుదల చేసినట్లు స్టాలిన్‌ ప్రకటించారు. ఈనెల 21న తాను కూడా తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించినట్టు పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో సచివాలయంలో గురువారం ఉదయం అధికారులతో సమావేశమై వరద బాధిత జిల్లాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలపై సమీక్ష కూడా జరిపానని చెప్పారు.

ఇళ్ల మరమ్మతులు, నిర్మాణానికి రూ.385 కోట్లు...

తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు మరమ్మతులు చేపట్టడానికి, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను కూల్చి కొత్తగా ఇళ్లను నిర్మించేందుకు రూ.385 కోట్లు కేటాయించినట్లు స్టాలిన్‌ తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను మళ్ళీ నిర్మించేందుకు రూ.4లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుకు రూ.2లక్షల దాకా నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. ఈ పథకం ‘మిచౌంగ్‌’ తుఫాను తాకిడికి గురైన తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాలకు కూడా వర్తిస్తుందన్నారు. ఆ మేరకు కొత్తగా 4577 ఇళ్లను నిర్మించనున్నామని, 9975 ఇళ్లకు మరమ్మతు చేయనున్నామని వివరించారు. ఈ పథకానికి అయ్యే నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కేటాయిస్తుందన్నారు.

పంట నష్టానికి రూ.250 కోట్లు...

మిచౌంగ్‌, వర్షబీభత్సానికి గురైన తూత్తుకుడి, తిరునల్వేలి, చెన్నై, తిరువళ్లూరు సహా ఎనిమిది జిల్లాల్లో సుమారు 2.64 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ పంటలను నష్టపోయిన రైతులకు సాయం అందించడానికి రూ.250 కోట్లు కేటాయించారు. సహకార సంఘాల ద్వారా వీరికి పంట రుణాలు, వ్యవసాయ పనిముట్ల కొనుగోళ్ల రుణాలు మంజూరు చేస్తారు.

వ్యాపారులకు రుణాలు...

ఎనిమిది జిల్లాల్లో వర్ష బీభత్సానికి నష్టపోయిన చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిరు వ్యాపారులకు రూ.లక్ష దాకా ప్రత్యేక రుణ సదుపాయం అందించనుంది. ప్లాట్‌ఫాంలలో దుకాణాలు నడుపుతున్నవారికి 4 శాతం వడ్డీతో రూ.10వేల దాకా రుణం మంజూరు చేస్తారు. అదే విధంగా చిరు వ్యాపారులకు 6 శాతం వడ్డీతో రూ.లక్ష దాకా రుణం మంజూరు చేస్తారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.3లక్షల దాకా రుణం మంజూరు చేస్తారు. ఎనిమిది జిల్లాలోనూ మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.350 కోట్ల రుణం మంజూరు చేశారు. తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లాల్లో వర్షబీభత్సానికి 4928 పడవలు, యంత్రాలు దెబ్బతిన్నాయి. వీటికి నష్టపరిహారం చెల్లించడానికిగాను రూ.15 కోట్లు మంజూరు చేశారు. తూత్తుకుడి జిల్లాలో ఉప్పు కయ్యలకు చెందిన కార్మికులకు, రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 09:08 AM