Chief Minister: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల గురించి సీఎం ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-13T08:36:17+05:30 IST

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల గురించి ముఱ్యమంత్రి సంచలన కామెంట్స్ చేశారు.

Chief Minister: కార్పొరేషన్లు, మున్సిపాలిటీల గురించి సీఎం ఏమన్నారో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ‘సమర్థవంతమైన సుపారిపాలన’ పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం వేగిరం చేసింది. ఇందులో భాగంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ప్రజలకు త్వరిగతిన సేవలందించే నిమిత్తం రూపొందించిన కొత్త ‘క్యూ ఆర్‌ కోడ్‌’ యాప్‌ను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రారంభించారు. సచివాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఈ కొత్త క్యూ ఆర్‌ కోడ్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. ఇదే విధంగా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో సేకరించే తడిచెత్త తదితర వ్యర్థాల నుంచి తయారు చేసిన సేంద్రియ ఎరువుకు ‘సెళిప్పు’ అనే నామకరణం చేసి ఆ ఎరువుల విక్రయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో డిజిటల్‌ సేవలను ప్రవేశపెట్టడంలో తమ ప్రభుత్వం ముందంజలో ఉందని, ఆ మేరకు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ప్రజలకు త్వరితగతిన సేవలందించేందుకు, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు క్యూఆర్‌కోడ్‌(QR Code) యాప్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు అమలు చేసే ప్రజా సంక్షేమ పథకాలు, పనులపై నిఘా వేయడానికి, వాటికి సంబంధించి ఫిర్యాదు చేయడానికి ఈ క్యూఆర్‌కోడ్‌ దోహదపడుతుందన్నారు. ఇకపై కార్పొరేషన్లు, మునిసిపాలిటీల ప్రధాన కార్యాలయాల వద్ద, బస్టాండ్లు, మార్కెట్లు, ఉద్యానవనాల వద్ద ఈ క్యూఆర్‌కోడ్‌ బోర్డులను ఏర్పాటు చేస్తారని చెప్పారు.

క్రీడా మైదానాల ప్రారంభోత్సవం....

సచివాలయంలో ఏర్పాటైన మరో కార్యక్రమంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ పరిధిలో కొత్తగా నిర్మించిన ఐదు క్రీడామైదానాలు సహా రూ.35.79 కోట్లతో పూర్తయిన పథకాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. రాయపురం కాత్పాడా మెయిన్‌రోడ్డులోని, మాధవరం రింగ్‌రోడ్డు, ఎంజీఆర్‌ రెండవ వీధి, ఆలందూరు - సేతులక్ష్మి అవెన్యూ వద్ద, మధురవాయల్‌ గంగానగర్‌ గాంధీ వీధిలో రూ.2.15 కోట్లతో కొత్త క్రీడా మైదానాలు నిర్మించినట్లు సీఎం తెలిపారు. ఇదే విధంగా నగరంలోని 19 ఉద్యానవనాలు, పాఠశాలల మరమ్మతు పనులు, ఐదు సబర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా ఆయన ప్రారంభించారు. ఇదే విధంగా మహానగర నీటి సరఫరా మురుగునీటి తొలగింపు సంస్థ ఆధ్వర్యంలో రూ.561.26 కోట్లతో పూర్తయిన 14 పథకాలకు ఆయన ప్రారంభించారు. అదే సమయంలో రూ.201 కోట్లతో చేపట్టనున్న తొమ్మిది కొత్త పథకాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక శాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ఆర్‌. ప్రియ, ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, నగరపాలక నిర్వహణ తాగునీటి సరఫరా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శివదాస్‌ మీనా, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‏సింగ్‌ బేదీ, మహానగర నీటి సరఫరా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిర్లేష్ కుమార్‌, రాష్ట్ర నీటి సరఫరా సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు.

nani3.jpg

Updated Date - 2023-05-13T08:36:17+05:30 IST