Chicken: వామ్మో.. ఈ మాంసం తింటే ఇంకేమైనా ఉందా...
ABN , First Publish Date - 2023-09-21T08:46:42+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లలో ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి, వందల కిలోల చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని,
- రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లలో తనిఖీలు
- వందలాది కిలోల చెడిపోయిన కోడిమాంసం స్వాధీనం
పెరంబూర్(చెన్నై): రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లలో ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి, వందల కిలోల చెడిపోయిన మాంసాన్ని స్వాధీనం చేసుకొని, వాటి యజమానులకు జరిమానా విధించడంతో పాటు పలు దుకాణాలను సీజ్ చేశారు. నామక్కల్ పరమత్తిరోడ్డులోని ఓ హోటల్లో ఈనెల 10వ తేది షవర్మ, గ్రిల్ చికెన్ తిన్న సందైపేట పుదూర్కు చెందిన పాఠశాల విద్యార్థిని కలైయరసి(14) మృతిచెందగా, ఆమె తల్లి, ముగ్గురు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి పాలైన విషయం తెలిసిందే. ఈ విషయమై అధికారులు చేపట్టిన విచారణలో ఆ హోటల్లో మాంసాహారం తీసుకున్న సుమారు 43 మంది అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా మాంసాహార హోటళ్లలో తనిఖీలు చేపట్టాలని ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సేలం అస్తంపట్టి, కొత్త బస్టాండ్, శారద కళాశాల రోడ్డు సహా పలు ప్రాంతాల్లోని హోటళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు, 182 కిలోల చెడిపోయిన కోడి మాంసం స్వాధీనం చేసుకొని, 10 హోటళ్లను సీజ్ చేశారు. తిరువళ్లూర్లో 55 హోటళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు, చెడిపోయిన మాంసం, పరిశుభ్రత లేకుండా ఉన్న సుమారు 10 హోటళ్లకు రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు జరిమానా విధించారు. అలాగే, చెన్నైలోని టి.నగర్, పెరంబూర్, కొళత్తూర్, బ్రాడ్వే, కోడంబాక్కం, వడపళని, కోయంబేడు సహా పలు ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతాయని, హోటళ్లలో మాంసాహార వంటకా లు తీసుకొనే ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఆరోగ్యశాఖ తెలియజేసింది.
