BJP Leader: నేను ముఖ్యమంత్రి బరిలో లేను.. కుండబద్దలు కొట్టిన బీజేపీ సీనియర్ నేత

ABN , First Publish Date - 2023-10-12T19:33:43+05:30 IST

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి.. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారు? ఏయే పార్టీలు ఎక్కడెక్కడ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయి? అనే లెక్కలు వేసుకోవడంతో పాటు...

BJP Leader: నేను ముఖ్యమంత్రి బరిలో లేను.. కుండబద్దలు కొట్టిన బీజేపీ సీనియర్ నేత

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ని ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి.. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు గెలుస్తారు? ఏయే పార్టీలు ఎక్కడెక్కడ ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తాయి? అనే లెక్కలు వేసుకోవడంతో పాటు ఆయా రాష్ట్రాలకు సీఎం అభ్యర్థులు ఎవరు? అనే చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తాను రాజస్థాన్ సీఎం అభ్యర్థి రేసులో లేనని క్లారిటీ ఇచ్చేశారు.

ఓవైపు రాజస్థాన్‌లో ఎన్నికల హీట్ పెరిగితే, మరోవైపు బీజేపీ మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏ నాయకుడి పేరుని వెల్లడించలేదు. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే, గజేందర్ సింగ్ షెకావత్‌లు ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ ఇద్దరిలోనే ఎవరినో ఒకరిని సీఎం పదవి వరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. తాను సీఎం రేసులో లేనని షెకావత్ తాజాగా తేల్చేశారు. దీనిపై ఇంతవరకు ఎలాంటి చర్చ జరగలేదని, పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అనుసరిస్తానని అన్నారు. తాను రాష్ట్రంలో అత్యున్నత పదవిని ఆశిస్తున్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు.


‘‘నేను ఎలాంటి రేసులోనూ లేను. పార్టీ హైకమాండ్ ఏ పని అప్పగిస్తే.. ఆ పని మాత్రమే చేస్తాను. ఇది తప్ప నాకు ఎలాంటి ఆకాంక్ష లేదా కోరిక లేదు’’ అని షెకావత్ స్పష్టం చేశారు. సీఎం పదవిపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని, అది పార్టీ పార్లమెంటరీ బోర్డు ద్వారా చెల్లుబాటు అవుతుందని తెలిపారు. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ సభలో ఈసారి 2013లో నమోదు చేసిన 163 సీట్ల రికార్డ్‌ను దాటేస్తుందని జోస్యం చెప్పారు. వసుంధర రాజే శిబిరంలో ఉన్నందున ఈసారి తమకు పార్టీ అభ్యర్థిత్వం నిరాకరించారనే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. 41 సీట్లకు 20 సీట్లే ప్రకటించారని, ఇప్పుడే దీనిపై మాట్లాడటం సరైంది కాదని పేర్కొన్నారు.

వసుంధర్ రాజే అత్యంత సీనియర్ నాయకుడని, పార్టీలో అన్ని స్థాయిల వ్యక్తులు ఆయన్ను గౌరవిస్తారని షెకావత్ పేర్కొన్నారు. పార్టీలో ఎటువంటి వర్గం లేదా సమూహం లేదని.. అందరూ కార్యకర్తలేనని అన్నారు. ఎవరెవరు ఏయే పదవికి సరిపోతారో, వారికి ఆ బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందన్నారు. ఇదే సమయంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. గెహ్లాట్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని అన్నారు. పేపర్ లీకేజీలు లక్షలాది యువకుల కలలను ఛిన్నాభిన్నం చేశాయని, నేరాలు రెట్లు కూడా పెరిగాయని, అవినీతి కొత్త శిఖరాల్ని తాకాయని ఆరోపించారు.

ఇదిలావుండగా.. తాను సీఎం రేసులో లేనని షెకావత్ స్పష్టం చేయడంతో, బీజేపీ తరఫున ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్తి? అనే ప్రశ్న మిస్టరీగా మారింది. అటు.. 41 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో బీజేపీ ఏడుగురు ఎంపీలను నామినేట్ చేసింది. జోధ్‌పూర్ ఎంపీని కూడా రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేయమని కోరే అవకాశం ఉంది. బహుశా జోధ్‌పూర్‌లోని సర్దార్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేయవచ్చు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదేమైనా.. సీఎం అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు క్లారిటీ రావాలంటే, మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - 2023-10-12T19:33:43+05:30 IST