Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషులను ముందుగానే విడిచిపెట్టడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-03-22T15:09:15+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసు లో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ..

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషులను ముందుగానే విడిచిపెట్టడంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసు (Bilkis Bano Case)లో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారంనాడు సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని (Special Bench) ఏర్పాటు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. 2000 గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు. అత్యాచార కేసులో 11 మంది దోషులను గడువుకు ముందే బీజేపీ సారథ్యంలోని గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో బిల్కిస్ బానో సవాలు చేశారు.

సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టపరమైన విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వ పూర్తికా నిర్లక్ష్యం చేసి, యాంత్రికంగా దోషుల విడుదలకు ఆదేశాలిచ్చిందని తన పిటిషన్‌లో బిల్కిస్‌బానో కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. యావజ్జీవ శిక్ష పడిన దోషులను ముందస్తుగా విడిచిపెట్టడం తప్పుడు సంకేతాలకు తావిచ్చిందని అన్నారు.

గోద్రా రైలును ఆందోళనకారులు తగులబెట్టిన అనంతరం చెలరేగిన అల్లర్లలో బిల్కిన్ బానో అత్యాచారానికి గురైంది. అప్పట్లో 21 ఏళ్ల వయస్సున్న ఆమె ఐదు నెలల గర్భవతి కూడా. బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో ముడేళ్ల ఆమె కూతురు కూడా ఉంది. ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును ఆ తర్వాత ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి. జైలులో సత్ప్రవర్తన పేరుతో గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలకు అనుమతించడంతో గోద్రా సబ్ జైలు నుంచి గత ఏడాది ఆగస్టు 15న వీరంతా విడుదలయ్యారు.

Updated Date - 2023-03-22T15:23:51+05:30 IST