Share News

Ashok Gehlot: కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో సంబంధం.. సీఎం అశోక్ గెహ్లాట్ ఎదురుదాడి

ABN , First Publish Date - 2023-11-13T18:01:35+05:30 IST

Kanhaiya Lal Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్‌లోని టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం గుర్తుందా? మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌కు గురైన నుపుర్ శర్మకు మద్దతుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని.. ఇద్దరు దుండగులు కన్హయ్య లాల్‌ను అతని షాప్‌లోనే నరికి చంపారు.

Ashok Gehlot: కన్హయ్య లాల్ హంతకులకు బీజేపీతో సంబంధం.. సీఎం అశోక్ గెహ్లాట్ ఎదురుదాడి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్‌లోని టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం గుర్తుందా? మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌కు గురైన నుపుర్ శర్మకు మద్దతుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని.. ఇద్దరు దుండగులు కన్హయ్య లాల్‌ను అతని షాప్‌లోనే నరికి చంపారు. అప్పట్లో ఈ వ్యవహారం పెను దుమారమే రేపింది. ఇప్పుడు రాజస్థాన్ ఎన్నికల్లో ఈ హత్యోదంతం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. ఈ ఉదంతాన్ని బీజేపీ తన అస్త్రంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఓటు బ్యాంకు కోసం ఈ హత్యని కాంగ్రెస్ వాడుకుంటోందని సంచలన ఆరోపణలు చేసింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన సీఎం అశోక్ గెహ్లాట్.. బీజేపీపై ఎదురుదాడికి దిగారు. ఆ ఇద్దరికి బీజేపీతోనే సంబంధాలున్నాయని కౌంటర్ ఎటాక్ చేశారు.


అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. కన్హయ్యలాల్‌ను చంపిన ఆ ఇద్దరు హంతకులకు బీజేపీతోనే సంబంధాలు ఉన్నాయని, నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆ కాషాయ పార్టీ ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అదొక దురదృష్టకరమైన ఘటన అని, తనకు ఆ ఇన్సిడెంట్ గురించి సమాచారం అందిన వెంటనే తన కార్యక్రమాలను రద్దు చేసుకొని అక్కడికి వెళ్లానని గుర్తు చేశారు. అయితే.. ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత కూడా బీజేపీలోని పలువురు అగ్రనేతలు మాత్రం సంఘటనా స్థలానికి రాకుండా, హైదరాబాద్‌లోని ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లారని దుయ్యబట్టారు. ఆ ఘటన జరిగిన రోజే ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఈ కేసును టేకప్ చేసిందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు. ఒకవేళ ఎన్‌ఐఏకి బదులు రాజస్థాన్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజి) ఈ కేసును టేకప్ చేసి ఉంటే.. విచారణ ఈపాటికి తుది దశకు చేరేదని వ్యాఖ్యానించారు.

ఈ ఘటన జరగడానికి కొన్ని రోజుల ముందే ఆ నిందితుల్ని పోలీసులు మరో కేసులో అరెస్ట్ చేశారని.. అయితే వారిని విడిపించుకోవడం కోసం కొందరు బీజేపీ నేతలు జైలుకు వెళ్లారని అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు. బీజేపీకి ఆ నిందితులతో సంబంధం ఉందని చెప్పడానికి.. ఇంతకన్నారుజువు ఇంకేం కావాలని నిలదీశారు. రాజస్థాన్ ఎన్నికల్లో తమ ఓటమి తథ్యమని బీజేపీకి అర్థమైపోయిందని, అందుకే తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలకు తెగబడిందని విమర్శించారు. తాము ప్రారంభించిన పథకాలు, తీసుకొచ్చిన చట్టాల గురించి బీజేపీ వాళ్లు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెప్తారని సీఎం అశోక్ గెహ్లాట్ చురకలంటించారు. ఇదిలావుండగా.. ఉదయ్‌పూర్‌లో అక్టోబర్ 2వ తేదీన నిర్వహించిన ర్యాలీలో కన్హయ్య లాల్ హత్య గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ హత్యని వాడుకున్నారని ఆరోపించారు. అందుకు కౌంటర్‌గా.. అశోక్ గెహ్లాట్ పైవిధంగా విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-11-13T18:01:37+05:30 IST