Arvind Panagariya: 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగరియా
ABN , Publish Date - Dec 31 , 2023 | 05:06 PM
నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా కేంద్రం నియమించింది. దీనితో పాటు రిత్విక్ రంజనం పాండేను కమిషన్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా(Arvind Panagariya)ను 16వ ఆర్థిక సంఘం (Finance Commission) చైర్మన్గా కేంద్రం నియమించింది. దీనితో పాటు రిత్విక్ రంజనం పాండే (Ritvik Ranjanam Pandey)ను కమిషన్ సెక్రటరీగా నియమించింది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 16వ ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (Tor)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర క్యాబినెట్ గత నెలలో అప్రూవ్ చేసింది. ఐదేళ్ల కాలానికి (2026-27 నుంచి 2030-31) సంబంధించిన రిపోర్ట్ను 2025 అక్టోబర్ 31లోగా రాష్ట్రపతికి కమిషన్ సమర్పించాల్సి ఉంటుంది.
కేంద్రం, రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ, ఆదాయం పెంపుదలకు సంబంధించిన చర్యలను ఆర్థిక సంఘం సూచిస్తుంది. ఫైనాన్సింగ్ డిజాస్టర్ మేనేజిమెంట్ కోసం ప్రస్తుతం ఉన్న ఏర్పాట్లపై కూడా సమీక్ష జరుపుతుంది. కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సలహాలు ఇచ్చే రాజ్యాంగ వ్యవస్థగా ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది. కాగా, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చిన నీతి ఆయోగ్కు తొలిచైర్మన్గా అరవింద్ పనగరియాను 2015లో మోదీ సర్కార్ నియమించింది. పనగరియా న్యూయార్క్లోని కొలంబియా వర్శిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేయడంతో పాటు ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, డబ్యూటీఓలో వివిధ హోదాలలో పని చేశారు.