Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ రెండో వీడియో... లొంగుబాటు, ప్రాణ భయంపై వివరణ...

ABN , First Publish Date - 2023-03-31T13:38:21+05:30 IST

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ గురువారం రాత్రి మరో వీడియోను

Amritpal Singh : అమృత్‌పాల్ సింగ్ రెండో వీడియో... లొంగుబాటు, ప్రాణ భయంపై వివరణ...
Amritpal Singh

న్యూఢిల్లీ : ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) గురువారం రాత్రి మరో వీడియోను విడుదల చేశారు. తాను పరారీలో లేనని, త్వరలోనే ప్రపంచం ముందుకు వస్తానని చెప్పారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని బుధవారం ఆయన పంజాబ్ పోలీసులకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సిక్కుల సమస్యలపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహించాలని సిక్కు మత పెద్ద (జతేదార్)ను ఆయన అంతకుముందు కోరారు.

తిరుగుబాటు జరిపే రోజులు కఠినంగానే ఉంటాయని అమృత్‌పాల్ చెప్పారు. తాను రోజుకు 20 మైళ్ల నుంచి 22 మైళ్ల వరకు నడవవలసి వస్తోందని, రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేయగలుగుతున్నానని, ఒక్కొక్క రోజు అది కూడా ఉండటం లేదని చెప్పారు. ప్రతిదానినీ కుట్రగా భావించవద్దని ఆయన కోరారు. గురు మీద నమ్మకం ఉంచుకోవాలన్నారు. తాను పరారీ అవడానికి గురు సహాయపడితే, అది చాలా గొప్ప ప్రయోజనం కోసమేనని చెప్పారు. తాను పలాయనవాదిని కాదని, తనకు ప్రాణ భయం లేదని చెప్పారు. త్వరలోనే తాను ప్రజల ముందుకు వస్తానని, వారి ముందు తిరుగుతానని తెలిపారు. కొందరు సలహా ఇస్తున్నట్లుగా దేశం విడిచి పారిపోయే వ్యక్తుల్లో తాను ఉండబోనని తెలిపారు. ప్రభుత్వానికి తాను భయపడటం లేదని, అదేవిధంగా అరెస్ట్ గురించి కూడా తనకు భయం లేదని తెలిపారు. తన అరెస్ట్ గురించి తానేమీ చెప్పలేదన్నారు. తాను ఎటువంటి షరతులను విధించడం లేదన్నారు. పోలీస్ స్టేషన్‌లో తనను కొట్టవద్దని షరతు విధించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. పోలీసులు తనను ఏదో విధంగా హింసించే అవకాశం ఉందని, అందుకు తాను భయపడనని మాత్రమే చెప్పానని తెలిపారు. తప్పుడు సమాచారం ఆధారంగా తప్పుదోవ పట్టవద్దని కోరారు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. అదేవిధంగా బైశాఖి రోజున సిక్కులతో సమావేశాన్ని నిర్వహించాలని అకల్ తఖ్త్ జతేదార్ జీ హర్‌ప్రీత్ సింగ్‌పై ఒత్తిడి పెంచారు.

ఇదిలావుండగా, అమృత్‌పాల్, ఆయన సహచరుడు పపల్ ప్రీత్ సింగ్ ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ నుంచి ఫగ్వారా సమీపంలోని డేరాకు మార్చి 26న చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరు ప్రయాణించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారు ఇక్కడి నుంచి హోషియార్‌పూర్ జిల్లాలోని నా-డాలోన్ గ్రామంలో ఉన్న డేరాకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక్కడ వీరు మార్చి 28 రాత్రి వరకు బస చేసినట్లు సమాచారం. వీరు ప్రయాణిస్తున్న వాహనానికి ముందు ఉన్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తుండగా, వీరిద్దరూ పారిపోయినట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి.

అమృత్‌పాల్ సింగ్ మార్చి 18 నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

Delhi Shastri Park: మస్కిటో కాయిల్ పొగ ఇంత డేంజరా.. పాపం.. ఒకే కుటుంబంలో ఆరుగురు చనిపోయారు..!

Digvijaya Vs Kapil : దిగ్విజయ సింగ్‌పై కపిల్ సిబల్ ఆగ్రహం

Updated Date - 2023-03-31T13:38:21+05:30 IST