Akhilesh Yadav: జేపీ సెంటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..అఖిలేష్ ఏం చేశారంటే..?

ABN , First Publish Date - 2023-10-11T15:23:59+05:30 IST

స్వాంతంత్ర్య సమరయోధుడు, ఎమర్జెన్సీ వ్యతిరేక నేత జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద బుధవారంనాడు హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల సాకుతో అధికారులు అనుమతి నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు జేపీఎన్ఐసీ ప్రహరీగోడలు ఎక్కి లోపలకు వెళ్లారు.

Akhilesh Yadav: జేపీ సెంటర్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు..అఖిలేష్ ఏం  చేశారంటే..?

లక్నో: స్వాంతంత్ర్య సమరయోధుడు, ఎమర్జెన్సీ వ్యతిరేక నేత జయప్రకాష్ నారాయణ్ (Jai Prakash Naryan) జయంతి సందర్భంగా లక్నోలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీఎన్ఐసీ) వద్ద బుధవారంనాడు హైడ్రామా చోటుచేసుకుంది. జేపీకి నివాళులర్పించేందుకు వెళ్లిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ (Akilesh Yadav)కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి తలెత్తింది. భద్రతా కారణాల సాకుతో అధికారులు అనుమతి నిరాకరించడంతో అఖిలేష్ యాదవ్‌తో పాటు పలువురు సమాజ్‌వాదీ పార్టీ నేతలు, కార్యకర్తలు జేపీఎన్ఐసీ ప్రహరీగోడలు ఎక్కి లోపలకు వెళ్లారు. దీంతో వారిని నిలువరించేందుకు, గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి జరిపారు.


గోమతి నగర్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఎదురుగా మూడు ఎకరాల స్థలంలో జేపీఎన్ఐసీ ఉంది. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2016 అక్టోబర్‌లో 11న దీనిని ప్రారంభించారు.2017లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులపై స్పెషల్ ఆడిట్ జరిపాలని యోగి ఆదిత్యనాథ్ కార్యాలయానికి సిఫారసులు వచ్చాయి.


అఖిలేష్ తీవ్ర అసంతృప్తి...

జేపీఎన్ఐసీలో జేపీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం అఖిలేష్ తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జేపీ కేంద్రంలోకి అడుగుపెట్టకుండా అధికారులు అడ్డుకోవడాన్ని నిలదీసారు. తనను అడ్డుకున్నది ఎవరో ప్రజలకు బాగా తెలుసునని, జేపీ కేంద్రం ప్రారంభోత్సవానికి ములాయం సిగ్ యాదవ్ ఇక్కడకు వచ్చిన విషయం తనకు బాగా గుర్తుందని, ఒక మ్యూజియం కూడా ఇక్కడ కట్టారని అన్నారు. దేశంలోనే జేపీకి ఇది ఏకైక ఏకైక మ్యూజియం అని తెలిపారు. జేపీ ప్రజలకు స్ఫూర్తి అని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంపై తమ గళం ఎలా వినిపించాలనే విషయంలో ప్రజలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. "జేపీ మ్యూజియంను వాళ్లు (యోగి ప్రభుత్వం) మూసేశారు. మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే చర్య కాదా ఇది? మ్యూజియం మాత్రమే కాదు, బిల్డింగ్‌ను కూడా మూసేశారు. ప్రజలను లోపలకు వెళ్లనీయడం లేదు'' అని అఖిలేష్ తెలిపారు. ప్రజాస్వామ్యం, సోషలిజం, సెక్యులరిజం అనేవి చురుకైన ప్రజా భాగస్వామ్యంపైనే ఆధారపడి ఉంటాయని, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. సంపూర్ణ విప్లవానికి జేపీ ఇచ్చిన పీలుపును అందిపుచ్చుకోవాలని, విలువల పరిరక్షణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Updated Date - 2023-10-11T15:23:59+05:30 IST