West Bengal: నిన్న హౌరా...నేడు హుగ్లీ.. శోభాయాత్రలో మళ్లీ అల్లర్లు

ABN , First Publish Date - 2023-04-02T20:06:00+05:30 IST

శ్రీరామ నవవి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌ లోని హౌరా సహా పలు ప్రాంతాల్లో రెండ్రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు ఇంకా ..

West Bengal: నిన్న హౌరా...నేడు హుగ్లీ.. శోభాయాత్రలో మళ్లీ అల్లర్లు

కోల్‌కతా: శ్రీరామ నవవి శోభాయాత్ర సందర్భంగా పశ్చిమబెంగాల్‌ (West bengal) లోని హౌరా సహా పలు ప్రాంతాల్లో రెండ్రోజుల క్రితం చెలరేగిన అల్లర్లు ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా హుగ్లీ (Hooghly)లో ఆదివారం సాయంత్రం మళ్లీ హింస చెలరేగింది. రాళ్లురువ్వుడుతో పాటు వాహనాలకు నిప్పుపెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుగ్లీలోని రిషర ప్రాంతంలో శ్రీరామ నవమి ఊరేగింపు జరుగుతుండగా రాళ్లురువ్వుడు ఘటన చోటుచేసుకుంది.

మండిపడిన దిలీప్ ఘోష్...

తాజా అల్లర్లపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీష్ ఘోష్ మండిపడ్డారు. శోభాయాత్ర జరుగుతుండగా మహిళలు, పిల్లలపై రాళ్లు రువ్వారని, హౌరా హింసాకాండ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ప్రశాంతంగా ఉండాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి

ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి అల్లర్లకు తావీయవద్దని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో అందరూ సహకరించాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. హౌరా కాజిపర అల్లర్ల వెనుక హిందువులు కానీ ముస్లింలు కానీ లేరని, బీజేపీ, ఇతర హిందుత్వ సంస్థల ప్రమేయం ఉందని ఆరోపించారు. పోలీసుల వైఫల్యాన్ని సీఎం అంగీకరిస్తూనే, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

పరిహారం..

ఘర్షణల్లో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుందని మమతా బెనర్జీ ప్రకటించారు. ఏ ప్రభుత్వం కూడా విధ్వంసాన్ని ప్రోత్సహించదని, బీజేపీ, భజరంగ్ దళ్, ఇతర అనుబంధ సంస్థలు నేరుగానే ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నాయని ఆమె ఆరోపించారు.

Updated Date - 2023-04-02T20:06:00+05:30 IST