Adipurush row: 'ఆదిపురుష్'పై ఎగసిపడిన ఆగ్రహ జ్వాలలు.. నిషేధించాలన్న అయోధ్య సాధువులు

ABN , First Publish Date - 2023-06-19T18:56:00+05:30 IST

రామాయణం ఇతివృత్తంగా ఓం రౌత్ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన 'ఆదిపురుష్' చిత్రంపై ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో సోమవారంనాడు నిరసనలు పెల్లుబికాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ అయోధ్య సాధువులు డిమాండ్ చేశారు.

Adipurush row: 'ఆదిపురుష్'పై ఎగసిపడిన ఆగ్రహ జ్వాలలు.. నిషేధించాలన్న అయోధ్య సాధువులు

లక్నో: రామాయణం ఇతివృత్తంగా ఓం రౌత్ దర్శకత్వంలో గత శుక్రవారం విడుదలైన 'ఆదిపురుష్' (Adipurush) చిత్రంపై ఉత్తరప్రదేశ్‌(Uttar pradesh)లోని పలు ప్రాంతాల్లో సోమవారంనాడు నిరసనలు పెల్లుబికాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ (Ban) అయోధ్య సాధువులు (Ayodhya Seers) డిమాండ్ చేశారు. సినిమాలోని సంభాషణలు చూసి తమ రక్తం మరిగిపోయిందంటూ ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు. వారణాసి, మధుర సహా పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటగా, వారణాసిలో ఒక వర్గం ప్రజలు సినిమా పోస్టర్లు చింపేశారు. చిత్రంలోని నటులు, దర్శకనిర్మాతలపై లక్నో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంభాషణలు విన్నప్పుడు రక్తం మరిగిపోయింది..

ఆదిపురుష్‌లోని నటీనటులు, సంభాషణలపై అయోధ్యలోని రామాలయ ప్రధాన పురోహితుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సినిమాలోని సంభాషణలు విన్నప్పుడు తమ రక్తం మరిగిపోయిందని, సినిమాను వెంటనే నిషేధించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. రాముడు, హనుమంతుడు, సీత క్యారెక్టర్లను ముస్లం క్యారెక్టర్లుగా చూపించారని ఆయన విమర్శించారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపించారు. అయోధ్యలోని హనుమాన్ ఘడి ఆలయ ప్రధాన అర్చకులు మహంత్ రామ్ దాస్ మరింత తీవ్ర ఆరోపణలు చేశారు. హిందూ మతం, సంస్కృతిపై జరిగిన విదేశీ కుట్రలో భాగంగానే ఈ సినిమాను రూపొందించారని అన్నారు. మహోన్నతమైన రామాయణం విలువలు, సంస్కృతిని ధ్వంసం చేసేలా రాముడు, హనుమంతుడు, సీత పాత్రలకు సంభాషణలు రాశారని మండిపడ్డారు.

గొంతు కలిపిన అఖిలేష్..

కాగా, ఆదిపురుష్ వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ కూడా గొంతు కలిపింది. ఒక ఎజెండాతోనే సినిమా తీశారని, దిగజారుడు సంభాషణలో భక్తుల మనోభావాలను గాయపరిచారని ఆ పార్టీ విమర్శలు గుప్పించింది. సెన్సార్ బోర్డు ధృతరాష్ట్రుడి తరహాలో గుడ్డిగా చూస్తుండిపోయిందా? అని ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నిలదీశారు.

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోనూ...

అటు...మహారాష్ట్రలోనూ 'ఆదిపురుష్' చిత్రంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. పాల్ఘర్‌లోని నలసోపరలోని మాల్‌లో 'అదిపురుష్' చిత్ర ప్రదర్శనను ఒక వర్గం వారు అడ్డుకున్నారు. హిందువుల మనోభావాలను ఈ చిత్రం గాయపరిచిందంటూ ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రథమ్‌ గ్రూప్‌ సభ్యులుగా నిరసనకారులు తమను తాము పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన 'ఆదిపురుష్' చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. టీ-సిరీస్ భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Updated Date - 2023-06-19T20:16:28+05:30 IST