Rajya Sabha Billinaires: రాజ్యసభలో 12 శాతం ఎంపీలు బిలియనీర్లు

ABN , First Publish Date - 2023-08-18T20:14:18+05:30 IST

పెద్దల సభలో బిలియనీర్లు 12 శాతం మంది ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలే అగ్రస్థానంలో ఉన్నారు. 233 స్థానాలున్న రాజ్యసభలో 225 ఎంపీలుండగా, రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్టు ప్రకటించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది పార్లమెంటేరియన్లలో ఐదుగురు (45 శాతం), తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు ఉన్నారు.

Rajya Sabha Billinaires: రాజ్యసభలో 12 శాతం ఎంపీలు బిలియనీర్లు

న్యూఢిల్లీ: పెద్దల సభలో(Rajya Sabha) బిలియనీర్లు (billionaires) 12 శాతం మంది ఉన్నారు. ఈ జాబితాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీలే అగ్రస్థానంలో ఉన్నారు. 233 స్థానాలున్న రాజ్యసభలో 225 ఎంపీలుండగా, రూ.100 కోట్లకు పైగా ఆదాయం ఉన్నట్టు ప్రకటించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది పార్లమెంటేరియన్లలో ఐదుగురు (45 శాతం), తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీల్లో ముగ్గురు ఉన్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాట్రిక్ రిఫామ్స్ (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.


రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నట్టు ప్రకటించిన ఎంపీల్లో మహారాష్ట్రలోని 19 మంది ఎంపీల్లో ముగ్గురు (16 శాతం) ఉన్నారు. ఢిల్లీ నుంచి ముగ్గురు ఎంపీల్లో ఒకరు (33 శాతం), పంజాబ్‌ నుంచి ఏడుగురు ఎంపీల్లో ఇద్దరు (29 శాతం), హర్యానా నుంచి ఐదుగురు ఎంపీల్లో ఒక్కరు (20 శాతం), మధ్యప్రదేశ్ నుంచి 11 మంది ఎంపీల్లో ఇద్దరు (18 శాతం) ఉన్నారు.


నివేదక ప్రకారం, తెలంగాణకు చెందిన మొత్తం ఏడుగురు బిలియనీర్ల మొత్తం ఆస్తి రూ.5,596 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల మొత్తం రూ.3,823 కోట్లు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది ఎంపీలు రూ.1,941 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు.


రాజ్యసభలోని 225 మంది సిట్టింగ్ ఎంపీలలో 75 మంది (33 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్టు డిక్లేర్ చేశారు. 41 మంది ఎంపీలు (సుమారు 18 శాతం) తమపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ప్రకటించగా, వీరిలో ఇద్దరు ఎంపీలపై సెక్షన్ 302 కింద హత్య కేసులు ఉన్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఉన్నవారిలో నలుగురు ఎంపీలు ఉన్నారని నివేదిక తెలిపింది.


కాగా, తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్‌లో ప్రకటించిన ఎంపీల్లో బీజేపీకి ఉన్న 85 మంది రాజ్యసభ ఎంపీల్లో 23 మంది ఎంపీలు (27 శాతం) ఉన్నారు.. కాంగ్రెస్‌కు చెందిన 30 మంది ఎంపీల్లో 12 మంది (40 శాతం), ఏఐటీసీ నుంచి 13 మంది ఎంపీల్లో నలుగురు (31 శాతం), ఆర్జేడీ నుంచి ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు (83 శాతం), సీపీఎం నుంచి ఐదుగురు ఎంపీల్లో నలుగురు (80 శాతం), ఆప్ నుంచి 10 మంది ఎంపీల్లో ముగ్గురు (30 శాతం), వైఎస్ఆర్‌సీపీ నుంచి 9 మంది ఎంపీల్లో ముగ్గురు (33 శాతం), ఎన్‌సీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ ఎంపీల్లో ఇద్దరు (67 శాతం) ఉన్నట్టు నివేదిక తెలిపింది.

Updated Date - 2023-08-18T20:26:00+05:30 IST