Pakistan Fuel Price Hike: పాకిస్థాన్‌లో దిమ్మతిరిగే రేంజ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

ABN , First Publish Date - 2023-08-01T21:41:16+05:30 IST

దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. అందులో భాగంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ‘జాతి ప్రయోజనాల’ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ నిట్టూర్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు.

Pakistan Fuel Price Hike: పాకిస్థాన్‌లో దిమ్మతిరిగే రేంజ్‌లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..!

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆదాయం కోసం ప్రజలపైనే భారం వేసేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధపడింది. అందులో భాగంగా నేటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ‘జాతి ప్రయోజనాల’ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పాక్ నిట్టూర్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌పై 19 రూపాయలు పెంచుతున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దర్ స్వయంగా వెల్లడించారు. లీటర్ పెట్రోల్ ధరపై 19.95 రూపాయలు, లీటర్ డీజిల్ ధరపై 19.90 రూపాయలు ధరను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచడం గమనార్హం. తాజాగా పెంచిన ఈ పెంపుతో పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.272.95కి చేరగా, లీటర్ డీజిల్ ధర రూ.273.40కు ఎగబాకింది. ఒక్క పెట్రోల్, డీజిల్ ధరలే కాదు పాకిస్థాన్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహార పదార్థాల ధరలు కూడా పతాక స్థాయికి చేరాయి.


ఉత్తర భారతదేశంలో లాగానే.. పాకిస్థాన్‌లో కూడా ప్రజల ప్రధాన ఆహారం గోధుమలు. తమకు అవసరమైన గోధుమలను పాకిస్థానీలే పండించుకుంటారు. మిగిలినదాన్ని ఎగుమతి కూడా చేస్తారు. కానీ.. గత ఏడాది పాకిస్థాన్‌ను ముంచెత్తిన వరదల దెబ్బకు లక్షలాది ఎకరాల్లో పంటలన్నీ నీటమునిగిపోయాయి. ఏడాది పొడుగునా వాడుకోవడం కోసం రైతులు ఇళ్లల్లో దాచుకున్న గోధుమలు కూడా తడిసి ముద్దయిపోయాయి. అయితే, పంజాబ్‌ ప్రాంతంలో వరదల తీవ్రత అంతగా లేనందున.. ఈ ఏడాది ఆహార సంక్షోభం రాదనే పాకిస్థాన్‌ ప్రభుత్వం భావించింది. దీంతో దిగుమతులపై పెద్దగా దృష్టి సారించలేదు. క్రమంగా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో ఇప్పుడు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేని పరిస్థితి. కారణమేదైనా గోధుమలకు తీవ్ర కొరత ఏర్పడడంతో వాటి ధరలు విపరీతంగా, పేదలు భరించలేనంతగా పెరిగిపోయాయి.

నిన్నమొన్నటి దాకా రూ.20 ఉండే కిలో గోధుమ పిండి ధర రూ.140 నుంచి రూ.160కి చేరింది. పది కిలోల బస్తాను వ్యాపారులు రూ.1500, 20 కిలోల బస్తాను రూ.2800 చొప్పున విక్రయిస్తున్నారు. ఆహార కొరత అత్యంత తీవ్రంగా ఉన్న ఖైబర్‌ ఫక్తూన్‌ఖ్వా ప్రాంతంలోనైతే 20 కిలోల బస్తాను రూ.3100కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం రంగంలోకి పది కిలోల గోధుమపిండి బస్తాను రూ.65 చొప్పున సబ్సిడీలో మినీ ట్రక్కుల ద్వారా పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ సరఫరా జనాభాకు సరిపడా లేకపోవడంతో సబ్సిడీ పిండి కోసం ప్రజలు ఎగబడి.. తొక్కిసలాటల్లో గాయాలపాలవుతున్నారు. కొందరు అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు.

పాకిస్థాన్‌లో ఒక్క గోధుమ పిండికే కాదు.. ఇతర ప్రధాన ఆహారపదార్థాలకూ తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో వాటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఉదాహరణకు కొన్నింటి ధరలు..

* చికెన్‌ రూ.460/కేజీ

* గుడ్లు రూ.300/డజన్‌

* బీఫ్‌ రూ.750-850/కేజీ

* మటన్‌ రూ.1500-1800/కేజీ

* ఎర్ర కందిపప్పు రూ.295/కేజీ

* పెసరపప్పు రూ.310/కేజీ

* ఉల్లిపాయలు రూ.180-280/కేజీ

* టొమాటో రూ.80-120/కేజీ

* పాలు రూ.180-200/లీటర్‌

Updated Date - 2023-08-01T21:41:30+05:30 IST