Share News

Kim Jong Un: వెక్కి వెక్కి ఏడ్చిన కిమ్ జోంగ్ ఉన్.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-12-06T15:31:58+05:30 IST

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కర్కశత్వం గురించి ఈ ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన చర్యలతో దేశ ప్రజల్ని తన అదుపులో ఉంచుకున్న నియంత ఆయన. ఎవరైనా తన ఆదేశాల్ని దాటి వ్యవహరిస్తే మాత్రం..

Kim Jong Un: వెక్కి వెక్కి ఏడ్చిన కిమ్ జోంగ్ ఉన్.. ఎందుకో తెలుసా?

Kim Jong Un Crying: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కర్కశత్వం గురించి ఈ ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన చర్యలతో దేశ ప్రజల్ని తన అదుపులో ఉంచుకున్న నియంత ఆయన. ఎవరైనా తన ఆదేశాల్ని దాటి వ్యవహరిస్తే మాత్రం.. నరకానికి మించిన శిక్షలు విధిస్తాడు. ఆ దేశం కరువుతో కొట్టుమిట్టాడుతున్నా, దేశ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా రాజభోగాలు అనుభవిస్తున్న డిక్టేటర్ ఆయన. అలాంటి వ్యక్తి తాజాగా దేశ ప్రజల ముందు వెక్కి వెక్కి ఏడ్చాడు. తాను ఏడ్వడంతో పాటు దేశాన్ని కూడా ఏడిపించాడు. ఉత్తర కొరియాల జననాల రేటు గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణం. దేశంలోని మహిళలు ఎక్కువమంది పిల్లల్ని కనాల్సిందిగా కోరుతూ.. కిమ్ జోంగ్ ఇలా కంటతడి పెట్టాడు.

గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్తర కొరియాలో జననాల రేటు గణనీయంగా క్షీణిస్తూ వస్తుండటంతో.. ఇటీవల ఆ దేశ రాజధాని ప్యాంగ్యాంగ్‌లో తల్లుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. ‘‘జననాల రేటు క్షీణతను నిరోధించడంతో పాటు పిల్లలకు సరైన సంరక్షణ అందించడం మన బాధ్యత. వారికి మంచి విద్యను కూడా అందించాలి. ఇందుకోసం మా ప్రభుత్వం దేశంలోని ప్రతి తల్లితో కలిసి పని చేయాలని కోరుకుంటోంది’’ అని తెలిపాడు. అలాగే.. జాతీయ శక్తిని బలోపేతం చేసేందుకు తల్లులంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలోనే ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. అతని ప్రసంగం విన్న మహిళలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం కిమ్ జోంగ్ తన కన్నీళ్లు తుడుచుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇదిలావుండగా.. ఇటీవలి దశాబ్దాల్లో ఉత్తర కొరియా జననాల రేటు గణనీయంగా తగ్గిందని యునైటెడ్ నేషన్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2023 నాటికి ఆ దేశంలో ఒక తల్లికి సగటు పిల్లల సంఖ్య 1.8 శాతంగా ఉన్నట్టు తేలింది. అంటే.. అక్కడి మహిళలు ఒకరు లేదా ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు. 1970-1980లలో ఉత్తర కొరియా యుద్ధం తర్వాత జనాభా పెరుగుదలను తగ్గించేందుకు గాను ఆ దేశ ప్రభుత్వం జనన నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. అయితే.. 1990ల మధ్యలో ఉత్తర కొరియాలో తీవ్ర కరువు వచ్చింది. వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. దాంతో.. లక్షలాది మంది చనిపోయారు. ఈ సంక్షోభం ఇప్పటికీ కొనసాగుతుండటంతో.. మరణాల రేటు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని కిమ్ జోంగ్ కోరారు.

ఉత్తర కొరియా జనన రేటును పెంచేందుకు గాను అక్కడి ప్రభుత్వం రకరకాల చర్యలు తీసుకుంటోంది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న తల్లిదండ్రులకు వివిధ ప్రయోజనాలను అందిస్తోంది. పిల్లలకు వసతి, రాష్ట్రం నుండి సబ్సిడీ, ఉచిత ఆహారం, మందులు, గృహోపకరణాలు, విద్యా సౌకర్యాలు వంటి ఉన్నాయి. వీటితో పాటు మరిన్ని పథకాల్ని కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. 2021 డేటా ప్రకారం, ఉత్తర కొరియా జనాభా 26 మిలియన్లు. అయితే.. 2034 నాటికి ఉత్తర కొరియా జనాభా మరింత తగ్గుతుందని, 2070 నాటికి ఉత్తర కొరియా జనాభా 23.7 మిలియన్లకు తగ్గుతుందని ఓ నివేదిక అంచనా వేసింది.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-12-06T15:45:06+05:30 IST