Dhaka Explosion: బంగ్లాదేశ్ పేలుడు ఘటనలో 15కు పెరిగిన మరణాల సంఖ్య

ABN , First Publish Date - 2023-03-07T22:18:06+05:30 IST

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఓ భవనంలో పేలుడు సంభవించడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.

Dhaka Explosion: బంగ్లాదేశ్ పేలుడు ఘటనలో 15కు పెరిగిన మరణాల సంఖ్య
Bangladesh, Dhaka, Dhaka Explosion

ఢాకా: బంగ్లాదేశ్ (Bangladesh) రాజధాని నగరం ఢాకా(Dhaka)లో ఓ ఆరంతస్థుల భవనంలో పేలుడు సంభవించడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 70 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది. రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

బంగ్లాదేశ్ మీడియా కథనాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 4.50 గంటలకు ఢాకా (Dhaka)లోని ఓ భవనంలో పేలుడు సంభవించింది. మంటలను ఆర్పేందుకు 5 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన చేరుకున్నాయి. క్షతగాత్రులను ఢాకా మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌ (Dhaka Medical College Hospital)కు తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వీరికి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

పేలుడు సంభవించిన భవనంలో దిగువ అంతస్థుల్లో కొన్ని దుకాణాలు ఉన్నాయి. దీనికి సమీపంలోనే ఓ బ్యాంక్ కూడా ఉంది. రోడ్డుపై నిలిపి ఉంచిన బస్సు కూడా ఈ పేలుడు ధాటికి దెబ్బతింది.

Updated Date - 2023-03-07T22:18:10+05:30 IST