Education: మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ రోగం! సర్కారు అప్రమత్తం

ABN , First Publish Date - 2023-09-29T11:10:36+05:30 IST

ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పుతోంది. మూడు మెడికల్‌ కాలేజీల్లో15 రోజుల వ్యవధిలో మూడు ర్యాగింగ్‌ ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం గాంధీ మెడికల్‌ కాలేజీలో సీనియర్‌ విద్యార్ధులు హాస్టల్‌లో

Education: మెడికల్‌ కాలేజీల్లో ర్యాగింగ్‌ రోగం! సర్కారు అప్రమత్తం

  • ప్రభుత్వ కాలేజీల్లో వరుస ఘటనలు తీవ్ర ఆందోళనకరం

  • మొన్న గాంధీ, నిన్న కాకతీయలో తాజాగా మహబూబాబాద్‌లో

  • ఇప్పటికే 17 మందిపై సస్పెన్షన్‌ వేటు

  • మహబూబాబాద్‌ కాలేజీలో మరో నలుగురైదుగురుపై?

  • అన్ని కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్స్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో ర్యాగింగ్‌ భూతం జడలు విప్పుతోంది. మూడు మెడికల్‌ కాలేజీల్లో15 రోజుల వ్యవధిలో మూడు ర్యాగింగ్‌ ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల క్రితం గాంధీ మెడికల్‌ కాలేజీలో సీనియర్‌ విద్యార్ధులు హాస్టల్‌లో మొదటి ఏడాది విద్యార్థులను ర్యాగింగ్‌ చేశారు. ఈ ఘటనపై వారు జాతీయ వైద్య కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. ఎన్‌ఎంసీ ఆదేశాలతో స్పందించిన సర్కారు వెంటనే యాంటీ ర్యాగింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది. ర్యాగింగ్‌కు పదిమంది సీనియర్‌ విద్యార్థులను బాధ్యులుగా గుర్తించి ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. ఆ ఘటన మరవకముందే తాజాగా వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కాలేజీలో మరో ర్యాగింగ్‌ అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 14న కాలేజీ హాస్టల్‌లో ఓ జూనియర్‌ విద్యార్థిపై సీనియర్‌ విద్యార్ధులు మూకుమ్మడిగా దాడి చేశారు. ఫలితంగా ఆ విద్యార్థి ఆస్పత్రి పాలయ్యాడు. దాడికి పాల్పడ్డ వారిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.

యాంటీ ర్యాగింగ్‌ కమిటీ రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఆ నివేదిక ప్రకారం ఏడుగురు విద్యార్థులపై వేటు పడింది. వారిని సస్పెండ్‌ చేశారు. అంతేకాదు మరో 20 మందికి షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. పదిహేను రోజుల వ్యవధిలో రెండు గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలకు చెందిన 17 మంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడి సస్పెండ్‌ అయ్యారు. తాజాగా మహబూబాబాద్‌ మెడికల్‌ కాలేజీలో జూనియర్‌ మెడికోలను సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. సీనియర్లను జూనియర్‌ గౌరవించాలని, సర్‌ అని సంభోందించాలని ర్యాగింగ్‌ చేసినట్లు సమాచారం. దీనిపై ఫిర్యాదులు అందగానే వెంటనే యాంటీ ర్యాగింగ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కమిటీ విచారణ చేస్తున్నదని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు నలుగురైదుగురు విద్యార్థులను మూడు నెలల పాటు కాలేజీ, హాస్టల్‌ నుంచి సస్పెండ్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఇలా మరికొన్ని కాలేజీల్లో కూడా ర్యాగింగ్‌ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. అయితే అవి ఫిర్యాదు వరకు రావడం లేదని ఆ వర్గాలు తెలిపాయి.

సర్కారు అప్రమత్తం

వరుసగా ర్యాగింగ్‌ ఘటనలు చోటుచేసుకోవడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. దీనిపై మంత్రి హరీశ్‌రావు కూడా సీరియస్‌ అయినట్లు సమాచారం. ర్యాగింగ్‌ నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక వరుస ఘటనలతో అన్ని మెడికల్‌ కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్‌ స్వ్కాడ్స్‌ను ఏర్పాటు చేయాలని డీఎంఈ ఓ సర్క్యులర్‌ జారీ చేశారు. దీంతో అన్ని కాలేజీల్లో ఈ యాంటీ ర్యాగింగ్‌ స్వ్కాడ్స్‌ను ఏర్పాటు చేశారు. నిజానికి ఇంతకుమునుపే జాతీయ వైద్య కమిషన్‌ ఆదేశాల మేరకు అన్ని కాలేజీల్లోనూ యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో కాలేజీలోని విద్యార్ధుల సంఖ్య ఆధారంగా సభ్యులుంటారు. పోలీసు విభాగం నుంచి సీఐ హోదా ఉన్నవారితో పాటు మెడికల్‌ కాలేజీ హెడ్‌, అధ్యాపకులు, సీనియర్స్‌, జూనియర్స్‌తో పాటు ఇతరులతో ఈ యాంటీ ర్యాగింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ వివరాలను ఎన్‌ఎంసీకి పంపారు.

అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా

ఓ దశాబ్దం క్రితం, ప్రస్తుతానికి ర్యాగింగ్‌ అంశం విషయంలో చాలా తేడాలొచ్చినట్లు అధ్యాపకులు చెబుతున్నారు. ఇప్పుడు ఏది ర్యాగింగో, ఏది కాదో విద్యార్థులకు తెలియడం లేదని అంటున్నారు. గతంలో ఎవరైనా విద్యార్థి ర్యాగింగ్‌కు గురైతే ర్యాగింగ్‌కు పాల్పడ్డ స్టూడెంట్‌ పేరెంట్స్‌ బాఽధిత విద్యార్థి తల్లిదండ్రులతో రాజీకి వచ్చేవారని గుర్తు చేశారు. మళ్లీ అటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ప్రస్తుతం ర్యాగింగ్‌కు గురైన విద్యార్థులు వెంటనే యూజీసీ, ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నేరుగా ఎన్‌ఎంసీ, పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు కూడా కాలేజీ ప్రిన్సిపల్స్‌కు విషయం తెలియడం లేదు. ర్యాగింగ్‌ విషయంలోనే ఎన్‌ఎంసీ నేరుగా రంగంలోకి దిగి, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తోంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును కాపాడే పరిస్థితి కూడా లేదని వైద్యవిద్య అధ్యాపకులు చెబుతున్నారు.

Updated Date - 2023-09-29T11:10:36+05:30 IST