Government Schools: సర్కార్ బడుల్లో చిమ్మ చీకట్లు! ఇళ్లకు వెళ్లిపోతున్న..!

ABN , First Publish Date - 2023-08-19T11:19:52+05:30 IST

ఏళ్ల క్రితం నిర్మితమైన సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నా..

Government Schools: సర్కార్ బడుల్లో చిమ్మ చీకట్లు! ఇళ్లకు వెళ్లిపోతున్న..!

విద్యుత్తు బిల్లులు చెల్లించక హైదరాబాద్‌లో కరెంట్‌ కట్‌

పలు స్కూళ్లలో రోజంతా విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులు

జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోనూ..

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఏళ్ల క్రితం నిర్మితమైన సర్కారు బడులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపికైన స్కూళ్లను సుందరంగా తీర్చిదిద్దుతున్నా.. అందులో కూడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ జిల్లాలోని పలు పాఠశాలలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 691 స్కూళ్లున్నాయి. ఇందులో 1,14,607 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే తరగతి గదుల్లో, విద్యార్థుల తాగునీటి అవసరాలకు విద్యుత్తు సరఫరా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో 4 నెలలకోసారి హెచ్‌ఎంలు బిల్లులు పంపించగానే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని సంబంధిత అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి స్కూళ్ల వారీగా బడ్జెట్‌ను విడుదల చేసి చెల్లించేవారు. అయితే ఈసారి నిర్ణీత గడువు ముగిసినా బడ్జెట్‌ విడుదల కాకపోవడంతో సరఫరాను నిలిపేస్తున్నారు. శుక్రవారం పలు స్కూళ్లలో సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు రోజంతా అంధకారంలోనే గడిపారు. కరెంట్‌ లేకపోవడంతో కొంతమంది పిల్లలు మధ్యాహ్న భోజనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయారు.

ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఆలియా ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో ఉదయం నుంచి కరెంట్‌ లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ స్కూల్‌లో 4 నెలలకు సంబంధించి రూ.38 వేల బిల్లు బకాయిలో ఉన్నట్లు తెలిసింది. అలాగే నాంపల్లిలోని ఎంజీఎం జీజీహెచ్‌ఎ్‌సలో రూ.20 వేలు, గన్‌ఫౌండ్రీలోని జీజీహెచ్‌ఎ్‌స మహబూబియాలో రూ.32 వేలు బకాయి ఉండటంతో సరఫరా నిలిపేశారు. ఇక జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోనూ మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కరెంట్‌ను కట్‌ చేశారు. దీనికి సంబంధించి సుమారు రూ.35 వేలు బకాయి ఉండడంతో విద్యుత్‌ అధికారులు సరఫరా నిలిపేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల చొరవతో సాయంత్రం 5.10 గంటలకు సరఫరాను పునరుద్ధరించారు. బకాయిల పేరిట విద్యుత్తు సరఫరా నిలిపేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు, పిల్లల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బడ్జెట్‌ విడుదల చేసి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2023-08-19T11:19:52+05:30 IST