AU VC: మరోసారి ఏయూ వీసీ బరితెగింపు]

ABN , First Publish Date - 2023-02-20T14:44:41+05:30 IST

అటు హైదరాబాద్‌ (Hyderabad)లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)! ఇటు విశాఖ (Visakhapatnam)లో ఆంధ్రా విశ్వవిద్యాలయం (Andhra University)! రెండూ ఘనమైన చరిత్ర, నేపథ్యం ఉన్నవే! దేశంలో

AU VC: మరోసారి ఏయూ వీసీ బరితెగింపు]
మెల్లగా జారుకుని...

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికోసం విందు భేటీ

ప్రైవేటు కాలేజీల నిర్వాహకులకు ఆహ్వానం

వేదికపైన వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి

మరికొందరు వైసీపీ నేతలూ హాజరు

వైసీపీ గెలుపుకోసం వీసీ రాజకీయ ప్రసంగం

విషయం తెలుసుకుని సీపీఎం నేతల ముట్టడి

కిచెన్‌లో నుంచి జారుకున్న వైస్‌ చాన్స్‌లర్‌

ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకుంటుందా?

అలాంటి వర్సిటీ...

అటు హైదరాబాద్‌ (Hyderabad)లో ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University)! ఇటు విశాఖ (Visakhapatnam)లో ఆంధ్రా విశ్వవిద్యాలయం (Andhra University)! రెండూ ఘనమైన చరిత్ర, నేపథ్యం ఉన్నవే! దేశంలో భాషాప్రాతిపదికన ఏర్పాటైన తొలి విశ్వవిద్యాలయం ఆంధ్రా వర్సిటీ. ప్రముఖ కవి, నాయకుడు డాక్టర్‌ కట్టమంచి రామలింగారెడ్డి ఏయూ తొలి ఉపకులపతిగా వ్యవహరించారు. ఆయన తర్వాత డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ (Sarvepalli Radhakrishnan) వర్సిటీ పగ్గాలు చేపట్టి విశ్వవిద్యాలయం ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఆయన హయాంలో భౌతిక, రసాయన, చరిత్ర, రాజనీతి, అర్థశాస్త్రంలో పేరెన్నికగన్న వ్యక్తులు ఏయూలో పాఠాలు బోధించారు. ఆ తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తొలి ఉప రాష్ట్రపతి అయ్యారు. రాధాకృష్ణన్‌ తర్వాత కట్టమంచి రామలింగారెడ్డి మరోసారి ఉపకులపతి పదవి అలంకరించి సుదీర్ఘకాలం పనిచేశారు. అటు తరువాత వచ్చిన డాక్టరు వీఎస్‌ కృష్ణ హయాం నుంచి ఇటీవలిదాకా వైస్‌ చాన్స్‌లర్‌లందరూ తమ శక్తి మేర విశ్వవిద్యాలయం ఉన్నతి, అభివృద్ధి కోసం పనిచేశారు. మరో మూడేళ్లలో ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల వేడుక జరుపుకోనుంది.

ఇలా తయారైంది...

వైసీపీ సర్కారు (YCP Government) అధికారంలోకి రాగానే ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద రెడ్డి(VC Professor PVGD Prasada Reddy) ని నియమించింది. అప్పటి నుంచీ ఆయన తీరు వివాదాస్పదమే. వర్సిటీ విద్యా సంబంధిత విషయాలకంటే... వైసీపీ రాజకీయ కార్యకలాపాలపైనే ఆయనకు ఆసక్తి ఎక్కువ! గ్రేటర్‌ విశాఖ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో ఆయనదే కీలక పాత్ర! అభ్యర్థులపై వర్సిటీ విద్యార్థులతో సర్వే చేయించారు. ఎన్నికల సమయంలో అభ్యర్థులతో, వైసీపీ నేతలతో వర్సిటీలోనే ‘వ్యూహ’ సమావేశాలు నిర్వహించారు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy), జగన్‌ (CM JAGAN), విజయసాయి రెడ్డి, వైఎస్‌ విజయలక్ష్మి పుట్టిన రోజులకు కేకులు కోసి సంబరాలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే... రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన వర్సిటీని స్వయంగా వైస్‌ చాన్స్‌లరే వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. ఘనత వహించిన ఆంధ్రా విశ్వవిద్యాలయ స్థాయిని దిగజార్చారు.

స్థాయి, స్థానం మరిచారు. అన్ని విలువలూ వదిలేశారు. ఒక్కముక్కలో చెప్పాలంటే... బరితెగించి వ్యవహరించారు. ‘ఎలాంటి ఆంధ్రా యూనివర్సిటీని ఇలా తయారు చేశారే’ అని మాజీ ఉప కులపతులు, అధికారులు, పూర్వ విద్యార్థులు, విద్యా నిపుణులు విస్తుపోయేలా వ్యవహరించారు. వారెవరో కాదు... స్వయానా ఆ విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌, ఆయనకు తోడుగా రిజిస్ట్రార్‌! ఇప్పటికే వైసీపీ కార్యకర్తలకంటే ఘోరంగా వ్యవహరిస్తున్న వీసీ... ఇప్పుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం ఓ సమావేశమే నిర్వహించారు. వైసీపీ అభ్యర్థితోపాటు ఇతర నేతలతో కలిసి వేదిక పంచుకున్నారు. ఎన్నికల కమిషన్‌ అన్నా తమకు లెక్కలేదన్నట్లుగా వ్యవహరించారు.

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేసి... సీఎం జగన్‌ బర్త్‌డేకు కేకులు కోసి, జేజేలు కొట్టి, వర్సిటీని జగన్‌ బ్యానర్లు, ఫొటోలతో నింపేసిన వైస్‌ చాన్స్‌లర్‌ ప్రసాద రెడ్డి మరోసారి బరితెగించారు. ఈసారి... ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్‌కు మద్దతుగా వర్సిటీలో సమావేశం ఏర్పాటు చేశారు. ‘గత నెలాఖరున నిర్వహించిన దక్షిణ భారత విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశం విజయవంతమైనందున ఆదివారం దసపల్లా హోటల్‌లో విందుకు రాగలరు’ అంటూ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల కరస్పాండెంట్లు/ సెక్రటరీలు, ప్రిన్సిపాళ్లకు నాలుగు రోజుల కిందట ఏయూ రిజిస్ట్రార్‌ పేరిట ఆహ్వానాలు వెళ్లాయి. స్వయానా రిజిస్ట్రార్‌ ఆహ్వానించడంతో ఆదివారం అందరూ తరలి వచ్చారు. అక్కడ వీసీతోపాటు అనూహ్యంగా... వైసీపీ అభ్యర్థి సుధాకర్‌, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నగర అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు, ఇతర నాయకులూ కనిపించారు. సమావేశం జరిగే హాలు పరిసరాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రారంభానికి ముందే.. ఎవరూ మొబైల్‌ ఫోన్లు ఆన్‌ చేయొద్దని, ఫొటోలు, వీడియోలు తీయొద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్‌కు ఓట్లు వేయాలని వీసీ కోరినట్లు తెలిసింది. ఇదే సమయంలో రాజకీయ ప్రసంగం కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఆపై మెల్లగా జారుకుని...

ఈ సమావేశం గురించి తెలుసుకున్న సీపీఎం నేతలు కుమార్‌, సుబ్బారావు, చంద్రశేఖర్‌, గౌతమ్‌, నాయుడు తదితరులు దసపల్లా హోటల్‌లోని హాలు వద్దకు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించారు. వాగ్వాదానికి దిగారు. సీపీఎం నేతలు వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో గొడవ పెద్దదైంది. ఈ గొడవలో మనమెందుకు అనుకుని... సమావేశానికి హాజరైన కళాశాలల ప్రతినిధులు కొందరు బయటకు వెళ్లిపోయారు. వైవీ సుబ్బారెడ్డి, రమేశ్‌బాబు సీపీఎం నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా వారు వెనక్కి తగ్గలేదు. తమ రంగు బయటపడే ప్రమాదముందని గ్రహించిన వీసీ ప్రసాదరెడ్డి, మాజీ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌, మరికొందరు అధికారులు సమావేశ మందిరానికి ఆనుకుని ఉన్న కిచెన్‌లోకి వెళ్లి... అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఇక... పోలీసులు రంగంలోకి దిగి సీపీఎం నాయకులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. సీపీఎం నేతలు ఆ తర్వాత సమావేశ మందిరం ఎదుట బైఠాయించి కోడ్‌ ఉల్లంఘించిన వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కించి మహారాణిపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సమావేశాన్ని నిర్వాహకులు అర్ధాంతరంగా ముగించారు. కాగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వీసీ ప్రసాదరెడ్డిని ఎన్నికల కమిషన్‌ తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ప్రసన్నకుమార్‌, ఎ.అశోక్‌ ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-02-20T14:44:42+05:30 IST