AP Education: ఉన్నత విద్యాశాఖ కొత్త ప్లాన్! పెద్ద ఎత్తున విమర్శలు

ABN , First Publish Date - 2023-08-23T12:16:15+05:30 IST

ఉన్నత విద్యాశాఖలో మరో రెండు కొత్త బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి నిధులన్నీ దారిమళ్లిస్తున్నారనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో రెండు బోర్డులు ఏర్పాటుచేసి వాటికి భారీగా నిధులు వెచ్చించనున్నారు.

AP Education: ఉన్నత విద్యాశాఖ కొత్త ప్లాన్! పెద్ద ఎత్తున విమర్శలు

ఉన్నత విద్యాశాఖలో బోర్డుల హల్‌చల్‌!

కరిక్యులమ్‌ అండ్‌ కంటెంట్‌ పేరిట ఒక బోర్డు

ఏపీ హెడ్స్‌ పేరుతో మరో బోర్డు

ఉన్నత విద్యామండలి తాజా ప్రతిపాదనలు

భారీగా నిధుల వ్యయానికి ‘ప్రణాళిక’

మండలి చేయాల్సిన పనులు ఇలా బోర్డులకు అప్పగింత!

నిధుల దుర్వినియోగంపై విమర్శల వెల్లువ

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యాశాఖలో మరో రెండు కొత్త బోర్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి నిధులన్నీ దారిమళ్లిస్తున్నారనే ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో రెండు బోర్డులు ఏర్పాటుచేసి వాటికి భారీగా నిధులు వెచ్చించనున్నారు. వాటిలో ఒకటి కరిక్యులమ్‌ అండ్‌ కంటెంట్‌ డెవల్‌పమెంట్‌ బోర్డు. ఏపీ ఉన్నత విద్య అడ్వాన్స్‌మెంట్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ(ఏపీ హెడ్స్‌) పేరుతో మరొక బోర్డు ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలు రూపొందించింది.

స్టూడియోతో కరిక్యులమ్‌ బోర్డు..

ఉన్నత విద్యలో విద్యార్థులకు అందిస్తున్న కరిక్యులమ్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడం, డిమాండ్‌కు అనుగుణంగా కరిక్యులమ్‌ తయారుచేయడం కరిక్యులమ్‌ అండ్‌ కంటెంట్‌ బోర్డు లక్ష్యమని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఈ బోర్డుకు ఇద్దరు అకడమిక్‌ ఆఫీసర్లు ఓడీపై పనిచేస్తారని, సబ్జెక్టు నిపుణులను అవసరమైన సంఖ్యలో తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, 12 మంది కంటెంట్‌ డెవలపర్స్‌, ముగ్గురు డిజైనర్లు, నలుగురు ఆడియో-వీడియో ఎడిటర్లు, ఐదుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఇద్దరు ఐటీ సపోర్ట్‌ ఉద్యోగులు, ఇద్దరు ఆఫీస్‌ అసిస్టెంట్లు అవసరమని ఉన్నత విద్యామండలి అంచనా వేసింది. ఈ బోర్డు ఏర్పాటులో భాగంగా ఒక స్టూడియో నిర్మించాలని, ఇందుకోసం 4,700 చదరపు అడుగుల ఆఫీసు కావాలని పేర్కొంది. స్టూడియో ఉపకరణాలకు రూ.1.15కోట్లు, ఉద్యోగుల జీతాలు, అద్దె, నిర్వహణ అన్నీ కలిపి 4.26 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. ఇక రాష్ట్రంలో ఉన్నత విద్యను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఉద్దేశంతో ఏపీ హెడ్స్‌ అనే మరో బోర్డును ఏర్పాటుచేయనున్నారు. ఇందులో జనరల్‌ బాడీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, అమలు కమిటీ ఉంటాయి. దీనికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఉన్నత విద్య, ఆర్థిక శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు ఇందులో ఉంటారు. ఈ బోర్డు నిర్వహణకు అయ్యే ఖర్చును పూర్తిగా ఉన్నత విద్యా మండలే భరిస్తుంది. బోధనా ప్రమాణాలు పెంచడం, నిధుల వినియోగంలో పారదర్శకత, పరిశ్రమలతో ఉన్నత విద్యను అనుసంధానించడం ఈ బోర్డు లక్ష్యాలని ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలో పేర్కొంది.

బోర్డుల మండలి..

ఉన్నత విద్యామండలిని ఈ ప్రభుత్వంలో బోర్డుల మయంగా మార్చారు. క్వాలిటీ ఎష్యూరెన్స్‌ సెల్‌, స్టేట్‌ రిసెర్చ్‌ బోర్డు, ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌లను కొత్తగా ఏర్పాటుచేశారు. వాటిలో అనేక మందికి ఉపాధి కల్పించారు. లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను ఏర్పాటుచేసి రూ.50లక్షలు వెచ్చించారు. అదనంగా అందులో ఐటీ నిపుణులంటూ పలువురికి జీతాలు చెల్లిస్తున్నారు. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు కొత్తగా రెండు బోర్డులు ఏర్పాటుచేయబోతున్నారు. ఒకప్పుడు అన్ని పనులనూ ఉన్నత విద్యామండలే చేసింది. ఇప్పుడు మండలి సరిపోదన్నట్టుగా ప్రతి దానికీ ఓ బోర్డు అంటూ ఏర్పాటుచేస్తున్నారు. పోనీ ఇవన్నీ చేయడం ద్వారా ఉన్నత విద్య మెరుగుపడిందా అంటే అదీ లేదు. ఎందుకంటే గత రెండేళ్లుగా ఉన్నత విద్యలో అడ్మిషన్లు భారీగా పడిపోతున్నాయి. ఒకప్పుడు 2లక్షలకు పైగా ఉన్న డిగ్రీ అడ్మిషన్లు ఈ ఏడాది 1.25 లక్షలకు పడిపోయాయి. 1.3 లక్షల మంది ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు తీసుకుంటారని అంచనా వేయగా కౌన్సెలింగ్‌కు కేవలం 1.03 లక్షల మంది విద్యార్థులే దరఖాస్తు చేసుకున్నారు. పీజీ కోర్సులకు రీయింబర్స్‌మెంట్‌ రద్దు చేయడంతో అడ్మిషన్లు చాలా వరకు తగ్గిపోయాయి.

పారితోషికం రహస్యమా?

ఉన్నత విద్యామండలిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు, ఇతర కొద్ది మంది అధికారులకు ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. ఇవి కాకుండా సెట్ల నిర్వహణకు అదనపు పని చేశారనే కారణంతో పారితోషికాలూ తీసుకుంటున్నారు. ఇవి దాదాపుగా వారి జీతాలతో సమానంగా ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో ఇలా పారితోషికాలు తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చైర్మన్‌కు ఎంత పారితోషికం చెల్లించారో చెప్పాలని సమాచార హక్కు చట్టం కింద ఓ దరఖాస్తు అందింది. అయితే ఆ వివరాలు వెల్లడించలేమని, కావాలంటే కార్యాలయానికి వస్తే చెప్తామంటూ ఓ అధికారి ఫోన్‌ చేసి దరఖాస్తుదారుకు చెప్పినట్టు తెలిసింది.

Updated Date - 2023-08-23T12:16:15+05:30 IST