Bank Accounts : గతేడాది బ్యాంక్ ఖాతాల నుంచి ప్రజల డబ్బు ఎంత చోరీ అయిందో తెలుసా..!
ABN , First Publish Date - 2023-05-09T10:33:45+05:30 IST
రాష్ట్రంలో గతేడాది ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ నేరస్తులు చోరీ చేసిన నగదు భారీగా ఉంది.
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో గతేడాది ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి సుమారు రూ.288 కోట్లు(288 crores) నూతన విధానంలో సైబర్ నేరస్తులు చోరీ చేసినట్లు సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. ప్రతిరోజు బ్యాంక్ ఖాతాల నుంచి రూ.50 కోట్లు చోరీ చేస్తున్నట్లు రాష్ట్ర సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదులందుతున్నాయి. ఇలాంటి చోరీలు అడ్డుకొనేలా సైబర్ క్రైం పోలీసులు(Cyber crime police) పలు చర్యలు చేపడుతున్నారు. బాధితులు ఫిర్యాదులందిన 24 గంటల్లోపు సదరు బ్యాంక్ అధికారులను సంప్రదించి చోరీకి గురైన సొమ్ము తిరిగి రాబట్టేలా సైబర్ క్రైం పోలీసులు సత్వర చర్యలు చేపడుతున్నారు. అలా, బ్యాంక్ ఖాతాల నుంచి చోరీకి గురైన రూ.106 కోట్లను స్తంభింపజేయగా, బాధితులు అందించిన ఫిర్యాదుల ఆధారంగా రూ.27 కోట్లు స్వాధీనం చేసుకొని వారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. గత మూడు నెలల్లో మాత్రమే రూ.67 కోట్లు చోరీకి గురైనట్లు, వాటిలో రూ.49 కోట్లు బ్యాంక్ ద్వారా స్తంభింపజేసి, రూ.6 కోట్లను బాధితులకు అందజేశారు. ఆన్లైన్(Online) మోసాలకు గురయ్యే వారు 24 గంటల్లోపు ‘19000’ అనే నెంబరుకు ఫిర్యాదుచేస్తే చర్యలు చేపడతామని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.