Delhi Crime: ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. కుర్రాడిపై ఎనిమిది మంది కత్తులతో దాడి.. చివరికి ఏమైందంటే?
ABN , First Publish Date - 2023-09-10T17:24:55+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8 మంది కలిసి ఓ కుర్రాడిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ యువకుడు..

దేశ రాజధాని ఢిల్లీలో ఒళ్లు గగుర్పొడిచే దారుణ సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 8 మంది కలిసి ఓ కుర్రాడిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్ట్ అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో జరిగింది.
సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా.. 8 మంది నిందితులు 18 ఏళ్ల యువకుడ్ని చుట్టుముట్టారు. కొందరు చేతులు, కాళ్లతో చితకబాదుతుండగా.. మరికొందరు కత్తులతో పొడుస్తూ ఒక వీధిలో ఈడ్చుకెళ్లారు. కొన్ని సెకన్ల పాటు ఈ దాడి కొనసాగింది. తనని 8 మంది చుట్టుముట్టడంతో.. పాపం ఆ ఒక్క యువకుడు వాళ్లను ఎదురించలేకపోయాడు. దురదృష్టం ఏమిటంటే.. చుట్టుపక్కల ఉన్న వాళ్లు ఈ దాడిని చూస్తూ ఉండిపోయారే తప్ప, అడ్డుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించలేకపోయారు.
ఇంతలో కొందరు దుండగులు వెనకడుగు వేయగా.. నలుగురు మాత్రం ఆ యువకుడిపై తమ దాడిని కొనసాగించారు. చివరికి వాళ్లు యువకుడ్ని ఓవైపుకి నెట్టేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. గాయాలతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లడాన్ని మనం గమనించవచ్చు. అయితే.. అతనికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఆ యువకుడు మృతి చెందాడు. ఈ దాడికి గల కారణాలేంటో తెలియరాలేదు. బహుశా.. గ్రూప్ సభ్యుల్లో ఏదో వాగ్వాదం జరిగి ఉండొచ్చని, ఈ క్రమంలోనే వాళ్లు దాడి చేసి ఉండొచ్చని తెలుస్తోంది.
మరోవైపు.. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మొత్తం 8 మంది నిందితులపై అతనిపై దాడి చేశారని గుర్తించిన అధికారులు.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా నిందితుల్ని పట్టుకొని, కఠినంగా శిక్షిస్తామని అధికారులు చెప్తున్నారు.