Reserve Bank Of India: 2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. అందులో ఏముందంటే..?

ABN , First Publish Date - 2023-09-01T21:14:59+05:30 IST

ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అందుకు సమానమైన కరెన్సీని తిరిగి పొందవచ్చని తెలిపింది. ఇంకా కేవలం 24 వేల విలువైన కోట్లు విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది.

Reserve Bank Of India: 2వేల నోట్లపై ఆర్‌బీఐ కీలక ప్రకటన.. అందులో ఏముందంటే..?

రూ.2వేల నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. మే 19న రూ. 2వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించగా.. ఇప్పటివరకు దాదాపు 93 శాతం వరకు నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ అయ్యాయి. ఆగస్టు 31, 2023 నాటికి బ్యాంకులకు తిరిగి వచ్చిన రూ.2వేల నోట్ల విలువ రూ.3.32 లక్షల కోట్లుగా ఉంటుందని ఆర్‌బీఐ తెలిపింది. ఇంకా కేవలం 24 వేల విలువైన కోట్లు విలువైన రూ.2వేల నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని స్పష్టం చేసింది. ప్రజల దగ్గర ఇంకా 2వేల నోటు ఉంటే ఈనెల 30లోగా బ్యాంకులకు వెళ్లి సదరు నోట్లను మార్చుకోవాలని ఆర్‌బీఐ సూచించింది.

ఇది కూడా చదవండి: Lalu Prasad Yadav: రూ.15 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేశారు.. ప్రధాని మోదీపై లాలూ ప్రసాద్ యాదవ్ సెటైర్లు

కాగా 2016లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సమయంలో తీవ్ర గందరగోళం నెలకొనగా.. అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రూ.2వేల నోటు ఉపసంహరణ కసరత్తు పూర్తి చేయడానికి ఆర్‌బీఐ నాలుగు నెలల సమయం ఇచ్చింది. దీంతో ప్రజలు తమ దగ్గర ఉన్న రూ.2వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారు. 500, 1000 నోట్ల రద్దు చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆర్‌బీఐ 2016 నవంబరులో 2వేల నోటును ముద్రించడం ప్రారంభించింది. అయితే 2వేల నోటుతో అవినీతి పెరిగిపోతుందని విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేయగా.. బీజేపీ ప్రభుత్వం క్రమంగా 2వేల నోటు ముద్రణ తగ్గించుకుంటూ వచ్చింది. దీంతో ఏటీఎంలు, బ్యాంకుల్లో 2వేల నోటు చలామణి కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 19న రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ నోట్లను సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసి అందుకు సమానమైన కరెన్సీని తిరిగి పొందవచ్చని తెలిపింది. అయితే ఈనెలలో 16 రోజుల పాటు బ్యాంకు సెలవులు ఉండటంతో అప్పటివరకు వేచి చూడకుండా ఇప్పుడే మీ నోట్లను మార్చుకునేందుకు ప్రయత్నించండి.


2వేల నోట్లను మార్చుకోవడానికి ఇలా చేయండి

1) కస్టమర్లు తమ వద్ద ఉన్న ₹ 2,000 నోట్లతో ప్రభుత్వ రంగ గుర్తింపు ఉన్న బ్యాంకులను సందర్శించాలి

2) అక్కడ బ్యాంక్ సిబ్బంది కస్టమర్లకు రిక్విజిషన్ స్లిప్ అందిస్తారు. ఈ స్లిప్‌లో రూ.2వేల నోటు మార్పిడి కోసం అవసరమైన వివరాలను నమోదు చేయాలి.

3) ఇతర డినామినేషన్లతో మార్చుకోవడానికి కస్టమర్లు ₹ 2,000 నోట్లతో పాటు స్లిప్‌ను బ్యాంక్ క్యాష్ కౌంటర్‌లో సమర్పించాలి.

4) బ్యాంకును బట్టి ఈ ప్రాసెస్‌లో మార్పులు ఉంటాయి

5) ₹ 2,000 నోట్లను గరిష్ట మొత్తంలో ఒకేసారి రూ.20వేల విలువ వరకు మార్చుకునేలా ఆర్‌బీఐ నిబంధన విధించింది.

Updated Date - 2023-09-01T21:14:59+05:30 IST