RBI Repo rate: వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2023-10-06T10:59:15+05:30 IST

గృహ రుణాలతోపాటు ఇతర ఈఎంఐలు చెల్లిస్తున్నవారికి చిన్నపాటి గుడ్‌న్యూస్. కీలకమైన రెపో రేటులో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించేందుకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమావేశంలో (monetary policy committee) ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.

RBI Repo rate: వడ్డీ రేట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం..

ముంబై: గృహ రుణాలతోపాటు ఇతర ఈఎంఐలు (EMI) చెల్లిస్తున్నవారికి చిన్నపాటి గుడ్‌న్యూస్. కీలకమైన రెపో రేటులో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించేందుకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమావేశంలో (monetary policy meet) ఎంపీసీ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మీడియా సమావేశంలో వెల్లడించారు. సర్దుబాటు ధోరణిని కొనసాగించాలని నిర్ణయించామని, పరిస్థితుల ఆధారంగా వడ్డీరేట్లపై నిర్ణయాలు ఉంటాయని పునరుద్ఘాటించారు.

కాగా.. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడం వరుసగా ఇది నాలుగవసారి కావడం విశేషం. ఏప్రిల్, జూన్, ఆగస్టు నెలలో జరిగిన ద్రవ్యపరపతి విధాన సమావేశాల్లోనూ ఆర్బీఐ కమిటీ ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా బ్యాంకులు తీసుకునే రుణాలపై ఆర్బీఐ చెల్లించే వడ్డీనే రెపో రేటు అంటారు. ఆర్బీఐ విధించే వడ్డీని బట్టి బ్యాంకులు కస్టమర్లపై ఆ భారాన్ని సర్దుబాటు చేస్తుంటాయి. ఇప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచలేదు, తగ్గించలేదు కాబట్టి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది. కాగా మే 2022 నుంచి ఆర్బీఐ రెపో రేటును వరుసగా పెంచుకుంటూ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 6.5 శాతానికి చేరింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు పెంచలేదు.


అనిశ్చితి పరిస్థితుల కారణంగా ద్రవ్యోల్బణం ఎలా ఉండబోతోందనే స్పష్టంగా అంచనా వేయలేకపోతున్నామని శక్తికాంత్ దాస్ చెప్పారు. ఖరీఫ్‌లో కొన్ని పంటల విత్తడం అంచనా కంటే తక్కువగా ఉందన్నారు. పప్పులు, ఆయిల్ సీడ్స్ ఈ జాబితాలో ఉన్నాయన్నారు. కొన్ని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయని, అంతర్జాతీయంగా ఆహార, ఇంధనాల ధరల విషయంలో అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయన్నారు. కాబట్టి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని అంచనావేశారు. తదుపరి ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నాటికి ఇది 5.2 శాతానికి తగ్గొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉందని చెప్పారు. ప్రపంచ వృద్ధికి భారత్ ఇంజన్ లాంటిదని ఈ సందర్భంగా శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-10-06T11:04:55+05:30 IST