Fact Check: మీ బ్యాంక్ అకౌంట్లో రూ.30 వేలకు మించి ఉంటే.. ఈ వైరల్ పోస్ట్‌ నిజమో.. కాదో.. తెలిసిపోయింది..!

ABN , First Publish Date - 2023-06-17T19:42:08+05:30 IST

సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. అదేంటంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుందనేది ఆ వార్త సారాంశం. దీంతో ఈ వార్త చూసిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు కంగారు పడిపోయారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు.

Fact Check: మీ బ్యాంక్ అకౌంట్లో రూ.30 వేలకు మించి ఉంటే.. ఈ వైరల్ పోస్ట్‌ నిజమో.. కాదో.. తెలిసిపోయింది..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నిజాల కన్నా అబద్దాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. మొబైల్ చేతుల్లో ఉంది కదా అని సోషల్ మీడియాలో కనిపించేవి కరెక్టో, తప్పో నిర్ధారణ చేసుకోకుండానే వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో కొందరు షేర్లు మీద షేర్లు కొట్టేస్తుంటారు. దీంతో తప్పుడు ప్రచారం వైరల్‌గా మారి ప్రజలు అయోమయంలో పడుతున్నారు. తాజాగా అలాంటి ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆర్బీఐ(RBI) గవర్నర్ శక్తికాంత్ దాస్ బ్యాంకు అకౌంట్ల విషయమై ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్‌గా మారింది. అదేంటంటే ఎవరి బ్యాంక్ అకౌంట్లోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ అకౌంట్ క్లోజ్ అవుతుందనేది ఆ వార్త సారాంశం. దీంతో ఈ వార్త చూసిన చాలా మంది బ్యాంకు ఖాతాదారులు కంగారు పడిపోయారు. ‘బ్యాంక్ అకౌంట్‌తో పాటు మా రూ.30 వేలు కూడా పోయినట్టేనా’ అని నానా హైరానా పడిపోయారు. అయితే.. ఈ వార్త నిజమా? కాదా? అనే అంశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB India) స్పందించింది. ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ ఫ్యాక్ట్ చెక్‌ (PIB Fact Check) పరిశీలనలో ఆ పోస్ట్ ఫేక్ అని తేలిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని నిజం లేదని PIB Fact Checkలో తేల్చింది. ఆర్బీఐ ఇప్పటివరకు అలాంటి నిర్ణయం ఏం తీసుకోలేదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన విషయాన్ని ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

FyqPpgAaQAEN6Zw.jpg

పీఐబీ ఇండియా చేసిన ట్వీట్‌లో ఏం ఉందంటే.. ‘‘ఎవరి బ్యాంకు ఖాతాలోనైనా రూ.30 వేలకు మించి ఉంటే ఆ ఖాతా మూసివేయబడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రకటన చేసినట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది. నిజానికి ఆ వార్త అవాస్తవం. దానిలో ఎలాంటి నిజం లేదు. ఆర్బీఐ గవర్నర్ ఇప్పటివరకు అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు’’ అని పేర్కొంది.

పీఐబీ ఫ్యాక్ట్ చెక్‌లో వార్తలను నిజనిర్దారణ చేయడం ఎలా అంటే..

అనుమానాస్పద సందేశం ఉంటే అది నిజమో కాదో తెలుసుకోవాలంటే https://factcheck.pib.gov.in.కి సందేశం పంపాలి. లేదా +918799711259 నంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా సందేశం పంపవచ్చు. అలాగే మెయిల్ ద్వారా కూడా నిజ నిర్దారణ చేసుకోవచ్చు. ఇందుకోసం pibfactcheck@gmail.com.కు మెయిల్‌లో సందేశం పంపాల్సి ఉంటుంది. ఇదే కాకుండా https://pib.gov.in. కూడా అందుబాటులో ఉంది. కాగా సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్‌ఫర్‌మేషన్ బ్యూరో డిసెంబర్ 2019లో ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్మ్‌ను ప్రారంభించింది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయ్యే ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని గుర్తించడం దీని ప్రధాన లక్ష్యం.

Updated Date - 2023-06-17T19:42:11+05:30 IST