EPFO Update: రూ.15 వేల జీతం ఉన్న ఉద్యోగులే ఇన్నాళ్లూ అర్హులు.. కానీ ఇప్పుడలా కాదు.. మీకు అర్థమవుతోందా..?

ABN , First Publish Date - 2023-06-16T15:47:48+05:30 IST

సీలింగ్‌తో సంబంధం లేకుండా అధిక వేతనంపై అధికంగా పింఛను పొందే సదుపాయం కలిగింది. సంస్థ, ఉద్యోగి కలిపి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఈపీఎఫ్‌వో అప్లికేషన్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌ అనే పేరుతో లింకును వెబ్‌ సైటులో అందుబాటులోకి తెచ్చింది.

EPFO Update: రూ.15 వేల జీతం ఉన్న ఉద్యోగులే ఇన్నాళ్లూ అర్హులు.. కానీ ఇప్పుడలా కాదు.. మీకు అర్థమవుతోందా..?

ఈపీఎఫ్‌వో చందాదారులకు అధిక పింఛన్‌కు వెసులుబాటు

దరఖాస్తులకు తుది గడువు జూన్ 26

ఉద్యోగుల భవిష్య నిధి (EPFO) విషయంలో సుప్రీంకోర్టు తీర్పు దయ చూపినా ఆ మేరకు ఫలితం అందే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి అవగాహనా లోపమే పెద్ద శాపంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీలింగ్‌తో పని లేకుండా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో)లోని చందాదారులకు అధిక పింఛను పొందే వెసులుబాటు కలిగింది. 2022 నవంబరు 4వ తేదీ నాటి తీర్పు మేరకు అమలుకు ఈపీఎఫ్‌వో 2022 డిసెంబరు 29న ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసింది. వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సంస్థలు దీనిపై పెద్దగా శ్రద్ధ చూపనట్టు తెలుస్తోంది. దీంతో పెద్ద సంఖ్యలో అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు ఉన్నా ఆ స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఈపీఎఫ్‌వో ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నా ఫలితం స్వల్పంగానే ఉంటోంది.

ఏమిటి ఉపయోగం

జీతంలో 12 శాతం చొప్పున ఉద్యోగి అంతే మొత్తంలో సంస్థ కలిపి ఈపీఎఫ్‌వో చందా చెల్లిస్తారు. గరిష్ఠంగా రూ.15 వేల వేతనం అందే ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనం చేకూరేది. కానీ సుప్రీం కోర్టు తీర్పుతో అధిక పింఛను అమల్లోకి వచ్చింది. సీలింగ్‌తో సంబంధం లేకుండా అధిక వేతనంపై అధికంగా పింఛను పొందే సదుపాయం కలిగింది. సంస్థ, ఉద్యోగి కలిపి ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఈపీఎఫ్‌వో అప్లికేషన్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌ అనే పేరుతో లింకును వెబ్‌ సైటులో అందుబాటులోకి తెచ్చింది.

అర్హులు వీళ్లే..

సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధికపింఛను పొందేందుకు యాజమాన్యం/యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. 2014 సెప్టెంబరు 1కి ముందు ఈపీఎఫ్‌వోలో చందాదారులుగా చేరి, ఆ తర్వాత సర్వీసులో కొనసాగుతూ అధిక వేతనంపై చందా చెల్లిస్తూ ఈపీఎఫ్‌ చట్టంలోని పేరా నం.11(3) ప్రకారం ఉమ్మడి పెన్షన్‌ ఆప్షన్‌ ఇవ్వని పింఛనుదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. సందేహాలు ఉంటే ఈపీఎఫ్‌వో సిబ్బందిని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు. 1995కి ముందు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రయోజనం పొందేవారు. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులు సామాజిక భద్రతకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 1995లో కీలక నిర్ణయం తీసుకొంది. ఈ పథకాన్ని ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌-1995 (ఈపీఎస్‌) అని పిలుస్తారు. బేసిక్‌ సేలరీ, డీఏ కలుపుకొని రూ.15 వేలు ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఈపీఎస్‌ వర్తిస్తుందనే నిబంధన ఉండేది. ఇప్పుడు గరిష్ఠ వేతనంపై పింఛను ఎంచుకొనే వెసులుబాటు కల్పించారు.

ఇలా చేయాలి..

ఈపీఎఫ్‌ అధికారిక వెబ్‌సైటు www.epfindia.gov.in లోకి వెళ్లాలి. హోంపేజీలో అప్లికేషన్‌ ఫర్‌ జాయింట్‌ ఆప్షన్‌ లింకును క్లిక్‌ చేయాలి. తర్వాత ఈపీఎస్‌ చట్టంలోని 11(3) కింద ఆప్షన్‌ దరఖాస్తును క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. దీనిని భవిష్య నిధి యూనివర్సల్‌ నంబరు(యూఏఎన్‌) ఖాతా ద్వారా పూర్తి చేయాలి. ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్‌ నెంబరు ఉండాలి. చందాదారు ఆధార్‌ నంబరు, పుట్టిన తేదీ తదితర వివరాలు ఈపీఎఫ్‌వో రికార్డులతో సరిపోవాలి. ఈపీఎఫ్‌వో దరఖాస్తు గడువును ఈ నెల (జూన్) 26 వరకూ పొడిగించింది.

Updated Date - 2023-06-16T15:47:56+05:30 IST