Viveka Case: అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా అప్‌డేట్ ఏంటంటే..

ABN , First Publish Date - 2023-06-02T13:26:41+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని..

Viveka Case: అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా అప్‌డేట్ ఏంటంటే..

హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బెయిల్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 5కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. వివేకా హత్య కేసులో ఐదు మంది నిందితులను సీబీఐ కోర్టు ముందు హాజరుపరిచింది. ఎర్ర గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిను సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరిచింది. భాస్కర్ రెడ్డి అనారోగ్య కారణంతో హాజరు కాలేకపోయారని న్యాయవాదులు తెలిపారు. నేడు కూడా విచారణకు అప్రూవర్ దస్తగిరి హాజరు కాలేదు. తదుపరి విచారణను 16వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

వివేకా కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పలు షరతులు విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషనపై జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టడం, మే 26, 27 తేదీల్లో అవినాశ్‌రెడ్డి తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్‌రావు, వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌, సీబీఐ న్యాయవాదులు అనిల్‌ తల్వార్‌, అనిల్‌కుమార్‌ కొంపల్లి వాదనలు వినిపించడం.. 27న ధర్మాసనం తీర్పు రిజర్వు చేయడం తెలిసిందే. బుధవారం (మే 31, 2023) దానిని వెలువరించింది. అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయాల్సి వస్తే రూ.5 లక్షల వ్యక్తిగత బాండ్‌, రెండు ష్యూరిటీలు తీసుకుని విడుదల చేయాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా పిటిషనర్‌ దేశాన్ని వీడరాదని పేర్కొంది.

సీబీఐకి సహకరించాలని.. దర్యాప్తులో జోక్యం చేసుకోవడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటివి చేయరాదని.. జూన ముగిసేవరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దర్యాప్తు సంస్థ ఎప్పుడు కోరితే అప్పుడు రావాలని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే అవినాశ్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది.

Updated Date - 2023-06-02T13:26:46+05:30 IST