YCP MLA: రజనీకాంత్‌ చెప్పింది నిజమే.. అసంతృప్తవాదులపై ఎమ్మెల్యే వసంత ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-08-21T15:35:37+05:30 IST

మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు మరోమారు రాజకీయాన్ని వేడెక్కించాయి.

YCP MLA: రజనీకాంత్‌ చెప్పింది నిజమే.. అసంతృప్తవాదులపై ఎమ్మెల్యే వసంత ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్టీఆర్ జిల్లా: మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ (MLA Vasntha Venkata Krishna Prasad) వ్యాఖ్యలు మరోమారు రాజకీయాన్ని వేడెక్కించాయి. మైలవరంలో అసంతృప్తవాదులపై ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మైలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, రైతులకు చెక్కుల పంపిణిలో వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం లో 175 మంది ఎమ్మెల్యేలలో ఎటువంటి అవినీతికి పాల్పడని వారు ఎవరైన ఉంటే వాళ్ళల్లో తాను ఒకడనని అన్నారు. తాను ఎంత సౌమ్యంగా ఉంటాననేది ఒక ప్రక్క అయితే రెండో ప్రక్క కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భయపెట్టో మరో రకంగానో వసంత కృష్ణప్రసాద్‌ను లొంగదీసుకోవాలనుకుంటే ఈ జన్మకి సాధ్యపడే పని కాదన్నారు. పదవులు ఇచ్చేదాకా నక్కవినయాలు ప్రదర్శించి ఇప్పుడు కుటిల బుద్దులు చూపుతున్నారని విమర్శించారు.‘‘సినిమాలో రజనీకాంత్ చెప్పినట్లు మొరగని కుక్క, విమర్శించని నోళ్ళు, ఈ రెండూ లేని ఊళ్ళు ఉండవు రాజా!’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. వర్గాలు లేకుండా ఉండాలనుకుంటే తనకు వర్గాలను అంటగడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.


‘‘అత్యంత నిజాయితీగా ఉండే ఎమ్మెల్యేల్లో నేను ఒకడిని... అవకాశం ఇస్తే రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తా, లేకపోతే నేను నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యంలో వ్యాపారాలు చేసుకుంటా. గతంలోనే అధిష్టానానికి అన్నీ చెప్పాను, ఇకపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే ఆలోచన లేదు. నేనేంటో వాళ్ళకి తెలుసు, కుతంత్రాలు చేసే వాళ్ళకు తెలుసు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటే ఫైనల్. నేను పక్కకు పోతే కుర్చీ లాక్కుందామని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రెండు సీట్లకు మాత్రమే పోటీ ఉండదు, ఒకటి జగన్మోహన్‌రెడ్డి పులివెందుల, రెండు చంద్రబాబు కుప్పం. వాళ్ళిద్దరికి ఎవరు పోటీ రారు, సీటు అడగలేరు. సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారాలను పట్టించుకునే సమయం లేదు. మరో వారం రోజుల్లో నియోజకవర్గం వ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తా’’ అంటూ మంత్రి జోగి రమేష్ వర్గాన్ని విమర్శిస్తూ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-21T15:35:37+05:30 IST