Kotam Reddy: తగ్గేదేలా.. ఎందాకైనా మాట్లాడుతా: కోటంరెడ్డి

ABN , First Publish Date - 2023-02-05T21:17:11+05:30 IST

పదిహేను మంది మంత్రులు ఒంటరిని చేసి ఒక్క ఎమ్మెల్యేపై మాట్లాడుతున్నారు. 175 స్థానాలూ గెలుస్తామన్న విశ్వాసం ఉంటే ఇంత అవసరమా? ఒక రోజు బెదిరింపు ఫోన్లు...

Kotam Reddy: తగ్గేదేలా.. ఎందాకైనా మాట్లాడుతా: కోటంరెడ్డి

నెల్లూరు: ‘పదిహేను మంది మంత్రులు ఒంటరిని చేసి ఒక్క ఎమ్మెల్యేపై మాట్లాడుతున్నారు. 175 స్థానాలూ గెలుస్తామన్న విశ్వాసం ఉంటే ఇంత అవసరమా? ఒక రోజు బెదిరింపు ఫోన్లు (Phones), మరో రోజులు కేసులు పెడుతున్నారు. తగ్గేదేలా.. ప్రజల పక్షాన ఎందాకైనా మాట్లాడుతా..’ అంటూ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) మరోసారి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తనకు టు ప్లస్‌ టు గన్‌మెన్లు ఉండగా వారిలో ఇద్దరిని వెనక్కు తీసుకున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే అధికారులు ఈ పని చేయరని తెలిపారు. తనకు అనేక బెదిరింపులు వస్తున్నాయని, ఈ సమయంలో భద్రత పెంచాల్సిందిపోయి ఉన్నవారిని కూడా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి భయబ్రాంతులకు గురిచేయాలని ప్రభుత్వం చూస్తోంది. ఇద్దరు గన్‌మెన్లను తొలగిస్తూ ప్రభుత్వం నాకు గిఫ్ట్‌ ఇచ్చింది. అయితే నాకున్న మిగిలిన ఇద్దరు గన్‌మెన్లను కూడా ప్రభుత్వానికి అప్పగిస్తూ రిటర్న్‌ గిఫ్ట్‌ (Return gift) ఇస్తున్నా. ఇంతకాలం నావెంట ఉన్న గన్‌మెన్ల కుటుంబాలకు అండగా ఉంటా. శ్రేయాభిలాషులు, కార్యకర్తలు, ప్రజలు నాకు అండగా ఉన్నారు. ఒక్కడినే ప్రజల్లో తిరుగుతా. ఏమైనా చేసుకోవచ్చు. నా గొంతు మూగబోదు. మానసికంగా బలహీనపడను. మరింత కసితో ముందుకు సాగుతా’ అని కోటంరెడ్డి స్పష్టం చేశారు. గన్‌మెన్లను తొలగించలేదని ఏఎస్పీ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnam Raju) కన్నా తనకు పదింతలు ఎక్కువగా వేధింపులు ఉంటాయని అర్థమవుతోందని చెప్పారు. తాను తప్పు చేసి ఉంటే ప్రజలే శిక్షిస్తారని పేర్కొన్నారు. తాను మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని నాలుగు ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలు చెప్పకుండా, నలభై తిట్లు, శాపనార్థాలతో ఎడముఖం పెట్టి ఉలిక్కిపడ్డారని కోటంరెడ్డి విమర్శించారు.

అమరావతి రైతుల సంఘీభావం

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి అమరావతి రైతులు (Amaravati Farmers) సంఘీభావం తెలిపారు. మందడం ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కట్టా రాజేంద్రప్రసాద్‌, జేఏసీ సమన్వయ కమిటీ సభ్యుడు ఆలూరు శ్రీనివాసరావుతో పాటు మరో ఇరవై మంది రైతులు ఆదివారం నెల్లూరుకు వచ్చి కోటంరెడ్డిని కలిశారు. రైతు కండువాను మెడలో వేసి వారు తమ సంఘీభావం ప్రకటించారు. పాదయాత్రలో భాగంగా నెల్లూరులో వర్షానికి ఇబ్బంది పడుతున్న సమయంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వచ్చి పరామర్శించి సంఘీభావం ప్రకటించారని ఈ సందర్భంగా అమరావతి రైతులు గుర్తు చేశారు. రాజధానికి వైసీపీ ప్రభుత్వం (YCP Govt) వ్యతిరేకంగా ఉన్న సమయంలో తమను కలిశారని, నేడు కృతజ్ఞతగా నెల్లూరుకు వచ్చి ఎమ్మెల్యేను కలిశామని వారు పేర్కొన్నారు. శ్రీధర్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని, ఆయనను అమరావతి (Amaravati) ఆహ్వానించామని, ఎప్పుడు వచ్చినా ఘన స్వాగతం పలుకుతామని వారు వెల్లడించారు.

Updated Date - 2023-02-05T21:27:25+05:30 IST