Visakha: స్టీల్ ఫ్లాంట్‌ను కాపాడుకుందాం: జెడి లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2023-04-15T12:35:23+05:30 IST

విశాఖ: తెలుగు ప్రజల తరఫున ఈఓఐ (EOI) బిడ్డింగ్‌ (Bidding)లో తాను పాల్గొంటున్నానని.. మన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పిలుపిచ్చారు.

Visakha: స్టీల్ ఫ్లాంట్‌ను కాపాడుకుందాం: జెడి లక్ష్మీనారాయణ

విశాఖ: తెలుగు ప్రజల తరఫున ఈఓఐ (EOI) బిడ్డింగ్‌ (Bidding)లో తాను పాల్గొంటున్నానని.. మన స్టీల్ ప్లాంట్‌ (Steel Plant)ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) పిలుపిచ్చారు. ఈ సందర్బంగా శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఒక్కొక్కరు 400 రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం వెచ్చిస్తే... మన స్టీల్ ప్లాంట్‌ను మనమే కాపాడుకుంటామని అన్నారు. చరిత్రలోనే నిలిచిపోయే నిర్ణయంగా మారుతుందన్నారు. ఫగ్గన్ సింగ్ (Faggan Singh) ఉక్కు సహాయ మంత్రి కాదని.. ఆసహాయ మంత్రి అని ఎద్దేవా చేశారు. ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాలన్నారు. పూటకో మాట మార్చడం సరైన పద్ధతి కాదని జెడి లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

కాగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగలేదని, ముందుకే సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గురువారం విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే.. ప్రైవేటీకరణపై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పరిశ్రమను విక్రయించే ఆలోచన లేదని ఉదయం ప్రకటించిన ఆయన.. సాయంత్రానికి మాట మార్చేసి పరిశ్రమను విక్రయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని, ఇప్పటికే సంస్థ లిస్టింగ్‌లో ఉందని వ్యాఖ్యానించడంతో పరిశ్రమ కార్మికులు, ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉక్కు శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని కొన్ని మీడియాలో వచ్చిన కథనాలను ఖండించింది. ‘విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పెట్టబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోలేదు. నిలిచిపోయిందని కొన్ని మీడియా కథనాలు వచ్చిన నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇస్తున్నాం. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సాగుతోంది. పరిశ్రమ పనితీరు మెరుగుపరచడానికి సంస్థ కృషి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వమూ మద్దతిస్తోంది’ అని పేర్కొంది. దరిమిలా ఇక పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదని తేటతెల్లమైంది. దీనిపై ఉక్కు కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.

శుక్రవారం సాయంత్రం స్టీల్‌ప్లాంటు జాతీయ రహదారి గేటు వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు. 800 రోజులుగా ఉద్యమిస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. ఆందోళనలు ఇంకా తీవ్రతరం చేయాలని నిర్ణయించాయి. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా శనివారం గంట్యాడ, కూర్మన్నపాలెం జంక్షన్ల నుంచి సింహాచలం తొలిమెట్టు వరకు పాదయాత్రలు నిర్వహించనున్నారు. ఉదయం ఆరు గంటలకు ఈ పాదయాత్రలు ప్రారంభమై పాతగాజువాకలో కలుస్తాయి. ఇక్కడి నుంచి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ కూడా పాదయాత్రలో పాల్గొంటారు. జాతీయ రహదారిపై ఆటోనగర్‌, విశాఖ డెయిరీ, నాతయ్యపాలెం, ఎన్‌ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం మీదుగా సింహాచలం తొలిమెట్టు వరకు పాదయాత్ర సాగనుంది. గాజువాక, డెయిరీ జంక్షన్‌, ఎన్‌ఏడీ, గోపాలపట్నంలలో హాల్ట్‌ ఉంటుందని, భారీఎత్తున ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు, నిర్వాసితులు, ఆయా సంఘాల నాయకులు, ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొనాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు పిలుపిచ్చారు. 25వ తేదీ ఉదయం స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ, డైరెక్టర్ల బంగళాలు ముట్టడిస్తామని ప్రకటించారు.

Updated Date - 2023-04-15T12:35:23+05:30 IST