Chintakayala Vijay: ఆ రోజు టీడీపీ తలచుకుంటే జగన్ సీఎం అయ్యేవారా?..

ABN , First Publish Date - 2023-06-02T10:12:20+05:30 IST

అమరావతి: ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు.

Chintakayala Vijay: ఆ రోజు టీడీపీ తలచుకుంటే జగన్ సీఎం అయ్యేవారా?..

అమరావతి: ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్రలో యువనేత నారా లోకేష్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ ఇద్దరు పాదయాత్ర, ఓదార్పు యాత్రలు చేశారని... ఆ రోజు టీడీపీ తలుచుకుంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యేవారా? ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు.

ఇవాళ అధికారం ఉందని లోకేష్‌పై ప్రొద్దుటూరులో కోడిగుడ్లతో దాడి చేశారని.. అధికారం శాశ్వతమా? అని విజయ్ ప్రశ్నించారు. రాజకీయ ఉన్మాదంతో కొంత మంది అధికారులు విర్రవీగుతున్నారని.. అన్నీ గుర్తుపెట్టుకుంటామని.. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని.. ఇదే వారికి హెచ్చరికని అన్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అండ చూసుకుని రెచ్చిపోతున్న వైసీపీ సైకోలు కూడా భూమి గుండ్రంగా ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పిరికిపంద చర్యలకు, నియంత్రత్వ పోకడలకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసునని చింతకాయల విజయ్ అన్నారు.

కాగా ప్రొద్దుటూరులో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌పై వైసీపీ మూకలు కోడిగుడ్లతో దాడి చేయడం గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శివాలయం సెంటరులో బహిరంగసభ అనంతరం ఆయన మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కొత్తపల్లి బైపాస్‌ మీదుగా కొత్తపల్లి పీఎన్‌ఆర్‌ ఎస్టేట్‌ వద్ద విడిదికేంద్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జనాలను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ కొత్తపల్లి రిలయన్స్‌ పెట్రోలుబంకు సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వైసీపీ కార్యకర్త లోకేశ్‌పై గుడ్డు విసిరారు. అది బద్వేలు టీడీపీ నేత రితీశ్‌కుమార్‌రెడ్డిని, లోకేశ్‌ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై సీఐ రాజారెడ్డిని లోకేశ్‌ ప్రశ్నించారు. మాపై దాడులు జరిగితే ఏం చేస్తున్నారని అడిగారు. మీరు ఫ్లెక్సీలు చించారంటూ సీఐ రాజారెడ్డి మాట్లాడడంతో లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాదయాత్రకు అనుమతి తీసుకున్నాం. మూడ్రోజులుగా వైసీపీవారే రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడుతుంటే మీరేం చేస్తున్నారు? భద్రత కల్పించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? మీ కథ తేలుస్తా’ అని హెచ్చరించారు. తర్వాత కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్‌ అక్కడే కాసేపు బైఠాయించి రాత్రి 10.30 గంటలకు విడిది కేంద్రానికి చేరుకున్నారు.

Updated Date - 2023-06-02T10:12:20+05:30 IST